- పరీక్షలు రాయాలంటే
- ఫీజు చెల్లించాలని మెలిక
- ఎమోషనల్ బ్లాక్మెయిల్చేస్తున్నారని పేరెంట్స్ఆవేదన
- క్లాసులు తప్ప పరీక్షలు వద్దన్న ప్రజ్ఞత గైడ్ లైన్స్
హైదరాబాద్, వెలుగు: “లాక్ డౌన్ స్టార్ట్అయిన కొద్దిరోజులకే నా జాబ్పోయింది. ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాం. మధురానగర్లోని ప్రైవేట్ స్కూల్ లో మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని స్కూల్ దగ్గర ఆందోళన చేశాం. అయినా మేనేజ్మెంట్ క్లాసుల పేరుతో ఓసారి, ఎగ్జామ్స్ పేరుతో మరోసారి ఫీజుల గురించి ఫోన్ చేస్తోంది. అన్ని ఫీజులు కడితేనే ఎగ్జామ్స్ కి పర్మిషన్ ఉండదంటూ ప్రెజర్ పెడుతోంది.”
– ఓ మధ్యతరగతి తండ్రి ఆవేదన
ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలను చదివిస్తున్న అనేకమంది పేరెంట్స్ ఇలాగే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆన్లైన్ క్లాసులు కండెక్ట్ చేసే స్కూల్స్ జీఓ నం.46 ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమే చార్జ్ చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. క్లాసులు మాత్రమే కండెక్ట్ చేయాలని, ఎగ్జామ్స్ పెట్టకూడదని ప్రజ్ఞత గైడ్ లైన్స్ లో తెలిపింది. అయినా చాలావరకు ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల కోసం ఎగ్జామ్స్ ను ముందుకుతెస్తున్నాయి. ఫీజు కట్టిన స్టూడెంట్స్కే ఎగ్జామ్కి పర్మిషన్ ఇస్తామని పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి.
గైడ్ లైన్స్ పట్టించుకుంటలేరు..
మినిస్ట్రీ ఆఫ్ హుమన్ రీసోర్స్ డెవలప్మెంట్ (ఎంహెచ్ఆర్డీ) డిజిటల్ ఎడ్యుకేషన్ పై రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ని ప్రైవేట్ స్కూల్స్ గాలికి వదిలేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కిండర్ గార్టెన్, నర్సరీ, ప్రీ స్కూల్ స్టూడెంట్స్ కి స్క్రీన్ టైం 30నిమిషాలు, 1– 8వ తరగతి వరకు డైలీ గంటన్నర లైవ్ క్లాసులు, 9–-12వ తరగతికి 3గంటలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి ఉంది. స్కూల్స్ మాత్రం సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కి రెండున్నర గంటల పాటు లైవ్ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ, హోమ్ వర్క్ షీట్స్ ఇస్తున్నాయి. ఎల్ కేజీ నుంచి టెన్త్క్లాస్ స్టూడెంట్స్వరకు అసిస్మెంట్ ఎగ్జామ్స్ పేరుతో టెస్ట్ లు కండక్ట్చేస్తున్నాయి. ఫీజుల కోసం ఎగ్జామ్పేరుతో ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుంటే మళ్లీ నిర్వహించలేమని మేనేజ్మెంట్లు హెచ్చరిస్తున్నాయి.
క్లాసుల నుంచి రిమూవ్
ఫీజు కట్టని స్టూడెంట్స్ని స్కూల్ మేనేజ్మెంట్లు ఆన్లైన్ క్లాసుల నుంచి రిమూవ్ చేస్తున్నాయి. హయత్ నగర్ లోని జీ హై స్కూల్ ఈ నెల 26న దాదాపు 250మంది ని స్టూడెంట్స్ని ఇలాగే తొలగించింది. పేరెంట్స్ ప్రశ్నిస్తే, ఫీజు కడితేనే క్లాసులకు అనుమతిస్తామని చెప్తోంది. దాంతో పేరెంట్స్ కమిటీగా ఏర్పడి సోమవారం స్కూల్ ముందు ఆందోళన చేశారు. ట్యూషన్ ఫీజు 30వేలయితే అన్ని ఫీజులూ కలిపి 70వేలు కట్టాలని మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓకి కంప్లయింట్చేసినా రెస్పాన్స్ లేదని వాపోయారు.
మానసికంగా వేధిస్తున్నరు
అసిస్మెంట్ ఎగ్జామ్స్ పేరుతో ప్రైవేట్స్కూల్స్ టెస్టులు కండెక్ట్ చేస్తు న్నాయి. ఫీజుల కోసం ఎగ్జామ్స్ పెడుతున్నాయి. ఆర్థికంగా దెబ్బతిన్న చాలామంది పేరెంట్స్ ఫీజులు కట్టలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన స్టూడెంట్స్ ఎగ్జామ్రాసి, తమ పిల్లలు రాయకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. -వెంకట్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ
స్కూల్ నుంచి మెసేజ్లు..
మా పిల్లలిద్దరూ ఆన్లైన్ క్లాసులు వింటున్నరు. ట్యూషన్ ఫీజు మాత్ర మే తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పినా, స్కూల్ ఫీజు మాత్రం తగ్గలేదు. ఎగ్జామ్స్ ఉన్నయి, వెంటనే ఫీజు కట్టాలని మేనేజ్మెం ట్ నుంచి మెసేజ్లు వస్తున్నయి. ఫీజు కట్టే పరిస్థితి లేదు. పిల్లలు ఎగ్జామ్ మిస్ అయితరేమోనని టెన్షన్గా ఉంది.
-మనోహర్, పేరెంట్, ఫిలింనగర్
స్టూడెంట్స్ నాలెడ్జ్ తెలుసుకునేందుకు..
లాక్ డౌన్ నుంచి మేం ఆన్లైన్క్లాసెస్ చెప్తున్నాం. స్టూడెంట్స్ కి లెసెన్స్ అర్థమయ్యాయో, లేదో తెలుసుకునేందుకు టెస్ట్ లు కండెక్ట్ చేస్తున్నాం. కొన్ని స్కూల్స్ మాత్రం ఎగ్జామ్స్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
-అమర్నాథ్, స్లేట్ స్కూల్స్ డైరెక్టర్