దేశ సంపదను నలుగురికే దోచిపెట్టిండు..ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్

దేశ సంపదను నలుగురికే దోచిపెట్టిండు..ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్
  • పదేండ్లలో వారణాసిలోని ఒక్క గ్రామం సందర్శించలే..
  • ఒక్క రైతునైనా ఎట్లున్నవని అడిగి తెలుసుకోలేదు
  • దేశంలో బొగ్గు గనులు, ఓడరేవులు, విద్యుత్​ ప్లాంట్లు ఆయన దోస్తుల చేతుల్లోనే..
  • రాయ్​బరేలీలో రాహుల్​ గాంధీ తరఫున ప్రచారం

రాయ్​బరేలి : వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ పదేండ్లలో నియోజకవర్గంలోని ఏ గ్రామాన్నీ సందర్శించలేదని, ఎట్లున్నవని ఏ రైతునూ అడగలేదని, రైతుల కష్టాలు తెలుసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. పదేళ్లలో ఒక్కసారి కూడా తన నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలను పట్టించుకునే తీరిక ఆయనకు దొరకలేదని అన్నారు.

ఈమేరకు ఆదివారం ఉత్తరప్రదేశ్​లోని రాయ్ బరేలీలో తన అన్న రాహుల్ గాంధీ కోసం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. దేశ సంపద మొత్తం ఆ నలుగురికి దోచిపెడుతున్నడని మండిపడ్డారు. దేశ సంపద మొత్తం దోస్తులకు దోచిపెట్టడం తప్పని చెప్పారు. 

ప్రస్తుతం దేశంలో బొగ్గు గనులు, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు.. వంటి కీలకమైన సంస్థలు చాలా వరకు మోదీ దోస్తుల చేతుల్లోనే ఉన్నాయని ప్రియాంక ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాన మంత్రులు గ్రామాలలో పర్యటిస్తూ జనం బాగోగులు అడిగి తెలుసుకునే వారని చెప్పారు. రైతుల సమస్యలపై నేరుగా వారినే అడిగే వారని వివరించారు.

ఈ మేరకు రాజీవ్​ గాంధీ, ఇందిరా గాంధీలను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా పెద్దపెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారని గుర్తుచేస్తూ.. అయితే, అందులో బడా పారిశ్రామిక వేత్తలు తప్ప సామాన్య రైతులు కనిపించరని ప్రియాంక గాంధీ ఆరోపించారు.