అయ్యయ్యో..! ప్రియాంకకు ప్లవర్ బోకే ఇచ్చారు.. పూలు మరిచారు

అయ్యయ్యో..! ప్రియాంకకు ప్లవర్ బోకే ఇచ్చారు.. పూలు మరిచారు

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇండోర్‌లో  ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ప్రియాంక పాల్గొన్నారు. వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే ఒక నేత మాత్రం ప్రియాంకకు ఇ‍చ్చిన ప్లవర్ బోకేలో పూలు లేవు. దాన్ని ఆయన అలానే ప్రియాంక చేతికి అందించాడు. దీనిని గమనించిన ప్రియాంక గాంధీ ఆ పుష్పగుచ్చంలో పూలు లేవని అక్కడున్న నేతలకు చెప్పారు. దీంతో వారంతా నవ్వుకున్నారు. ప్రియాంక కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా సరదాగా నవ్వుకున్నారు. 

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు.

అంతకుముందు.. ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు.

నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది.