బీజేపీ గెలిస్తే .. దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: కోదండరాం

బీజేపీ గెలిస్తే .. దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: కోదండరాం

నర్సంపేట, వెలుగు: కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదమని టీజేఎస్​ చీఫ్, ​ ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. వరంగల్ ​జిల్లా నర్సంపేటలో అంబటి శ్రీనివాస్​అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ ప్రజా సదస్సు గురువారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ దేశ సంపద, వనరులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్​శక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ ​రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. దేశంలో మెజార్టీగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లే ఆయుధమని చెప్పారు. 

బీజేపీకి ఎలక్టోరల్ ​బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయంటే సంపద ఎవరి చేతుల్లో ఉందో, ఎలా వెళ్లిందో ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. మహబూబాబాద్​లో కాంగ్రెస్​ అభ్యర్థి పోరిక బలరాంనాయక్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ ​కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట అధ్యక్షుడు అంబటి నాగయ్య, టీజేఎస్​జిల్లాఅధ్యక్షుడు షేక్​జావీద్, గుంటి రాంచందర్, సాంబరాతి మల్లేశం  పాల్గొన్నారు.