ములుగు/ తాడ్వాయి, వెలుగు: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆఫీసర్లను ఆదేశించారు.
బుధవారం ఆయన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణం, హెలిప్యాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్ను పరిశీలించారు.
హెలిప్యాడ్ వద్ద బారికేడింగ్, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. అంతకుముందు కలెక్టరేట్లో వివిధ కార్యాలయ గదులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
