త్వరలో పబ్లిక్ డేటా బేస్​

త్వరలో పబ్లిక్ డేటా బేస్​
  •      ప్రజల సమగ్ర సమాచారంపై ప్రభుత్వం కసరత్తు
  •     సర్కారు పాలసీలకు, స్కీములకు డేటానే కీలకం
  •     రేషన్ డేటా ఓల్డ్..ఐదేండ్లుగా నో అప్​డేషన్
  •     సమగ్ర కుటుంబ సర్వే పనికి వస్తలే
  •     రుణమాఫీ ఇష్యూతో ప్రభుత్వం యోచన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్ర డేటాబేస్​ను రెడీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్కీముల అమలు, సర్కార్ పాలసీలకు ఈ డేటాబేస్ కీలకం కానుంది. భవిష్యత్​లో దాని ఆధారంగానే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నది. రాష్ట్రానికి సంబంధించి పూర్తి డేటాబేస్ అందుబాటులో ఉంటే అనర్హులు, అర్హుల లెక్క తేల్చడంతో పాటు ఏ వర్గానికి ఏం మేలు చేయవచ్చనేది కూడా స్పష్టత రానుంది. దీంతో ఇప్పటికే వివిధ రకాలుగా ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న డేటాను పరిశీలన చేస్తున్నది. 

రుణమాఫీకి సంబంధించి కుటుంబాల నిర్ధారణకు రేషన్ కార్డు డేటాను ప్రభుత్వం ప్రామణికంగా తీసుకున్నది. అయితే అది పూర్తి స్థాయిలో ఆప్​డేట్ లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు, ఆయా కేటాగిరీల వారీగా ప్రజా సమాచారం రెడీ చేయాలనుకుంటున్నది. ఇప్పటికే రేషన్ కార్డులు (ఫుడ్ సెక్యురిటీ), గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, సీసీఎల్​ఏ దగ్గర రైతుల సమాచారం, ప్రజా పాలనలో భాగంగా ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న అప్లికేషన్ల డేటా, ఇక వివిధ శాఖల దగ్గర సంబంధిత సమాచారం ఉన్నది. 

వీటిల్లో దేంట్లోనూ పూర్తి అథెంటిక్ డేటా లేదు. ఇప్పుడు రేషన్ కార్డు డ్రైవ్ తీసుకుంటే ఆ రకంగానైనా క్లారిటీ వస్తుందని ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. ఈ విషయపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఎక్కడ ఎన్ని కుటుంబాలున్నాయో తెలిస్తే.. పాలసీల రూపకల్పన ఈజీ అవుతుందని, స్కీముల అమలు పక్కాగా ఉంటుందని సర్కార్ భావిస్తుంది.

రేషన్ కార్డుల్లోనూ అరకొర సమాచారం

రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షలకు పైగా రేషన్ (ఫుడ్ సెక్యురిటీ) కార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వం రేషన్ కార్డుల సమాచారాన్ని ఆప్ డేట్ చేయలేదు. ఇండ్లలో ఆడపిల్లల పెండ్లిలు అయి.. వారికి పిల్లలు పుట్టినా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కుటుంబంలో అన్నదమ్ములు, తల్లిదండ్రులు.. కుమారులు వేరుపడినోళ్లకు సపరేట్ కార్డులు రాలేదు. కొంతమంది చనిపోయినా వారి పేర్లు కూడా రేషన్ కార్డులలో కంటిన్యూ అవుతున్నాయి. అదే సమయంలో అనర్హులకు చాలామందికి రేషన్ కార్డు ఉన్నట్లు తెలుస్తున్నది. 

దీంతో రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ తప్పనిసరి చేయడంతో.. ఇప్పుడు ఈ కార్డులకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త కార్డుల కోసం దాదాపు 16 లక్షల అప్లికేషన్లు పెట్టుకున్నారు. పైగా ఆరోగ్యశ్రీ కి రేషన్ కార్డు లింక్ ను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మళ్లీ రేషన్ కార్డు డ్రైవ్ చేపడితే.. డేటా అంతా ప్యూరిఫికేషన్ అవుతుందని ప్రభుత్వం అనుకుంటున్నది.

 ప్రజా పాలన అప్లికేషన్లతో కొత్త  డేటా

రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్యారంటీలతో పాటు వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వంలోకి రాగానే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటి 30 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కుటుంబ వివరాలను కూడా తీసుకున్నారు. ఆయా గ్యారంటీలకు కుటుంబాల వారీగా అప్లై చేసుకున్నారు. అయితే అప్లికేషన్​ డేటాను.. ఇతర డేటాతో పోల్చి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం దగ్గర పక్కా ఆప్​డేటేడ్ సమాచారం లేదు. 

దీంతో గ్యారంటీల్లో కొన్ని కొందరికి డబుల్ అందేలా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది మొదటికే మోసం తెస్తుందని.. ప్రజాధనం దుర్వినియోగం కావొద్దనే నిర్ణయానికి వచ్చింది. దీంతో కుటుంబాల వారీగా పూర్తి డేటా తీసుకోవాలని.. ఏ రకంగా అయితే తొందరగా సమాచారం తీసుకోగలుగతామో అనే దానిపైనా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్లు సమాచారం.

సమగ్ర కుటుంబ సర్వే డేటాపై నో క్లారిటీ

తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా 2015లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలు, వారి కేటాగిరీ, భూముల వివరాలు, ఇండ్ల వివరాలు, ఇతరత్రా వంటివన్నీ సేకరించారు. ఆ సర్వే వివరాలను అప్పటి ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ పొలిటికల్​గా వివిధ రకాలుగా ఆ సమాచారాన్ని వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 

ఇప్పుడు ఆ డేటాను కూడా పరిశీలించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. ఈ పదేండ్లలో జరిగిన మార్పులు ఏమిటి ? ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రణాళికలు రెడీ చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో ఏ సమాచారం ఇప్పుడు ఉపయోగపడుతుందో కూడా తేల్చాలని అధికారులకు చెప్పినట్లు తెలిసింది.