జైలు అంటే తప్పు చేసిన వాళ్లను శిక్షించే స్థలం అనుకుంటారు చాలామంది. కానీ, శిక్షించడమే కాదు, వాళ్లను మంచి మనుషులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేది కూడా. ఖైదీల మానసిక స్థితిని మార్చాలని జైలు అధికారులు రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. అలాంటిదే పుదుచ్చేరి ఖైదీల కోసం జైలు అధికారులు ప్రారంభించిన రిహాబిలిటేషన్ ప్రోగ్రామే ఈ ‘డాన్స్ థెరపి.’
కొందరు ఖైదీలు చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడినా జైలు శిక్ష తగ్గదు. ఇక చేసేదేం లేక కుటుంబం గురించి ఆలోచిస్తూ లోలోపలే కుంగిపోతుంటారు. కాకపోతే వాళ్లనూ మనుషుల్లానే చూడాలి. మారడానికి మన వంతు సాయం చేయాలి’ అంటున్నాడు జైల్ ఇన్స్పెక్టర్ రవిదీప్ సింగ్ చాహర్. రిహాబిలిటేషన్ లాంటి ఆలోచన నుంచి పుట్టిందే డాన్స్ థెరపి.
ఏంటీ డాన్స్ థెరపి
డాన్స్ వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామం అందటమే కాదు, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. చాలీచాలని చోటు, బయటి ప్రపంచంతో తెగిన సంబంధాలు. రకరకాల మనుషులు, మనస్తత్వాల మధ్య జైలు జీవితం గడుపుతుంటారు ఖైదీలు. దాని వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్లను మామూలుగా మార్చడానికి డాన్స్ థెరపి ఉపయోగపడుతుంది. అందుకే క్లాసికల్ డాన్సర్ కృతుంగ రవిచంద్రన్ను డాన్స్ టీచర్గా రమ్మన్నారు పుదుచ్చేరి జైలు అధికారులు. ఆమె రోజూ సెషన్ల వారీగా అక్కడి ఖైదీలకు డాన్స్ పాఠాలు చెప్తోంది. ‘వాళ్లని వాళ్లు తెలుసుకోవడానికి, లైఫ్లో సెకండ్ ఛాన్స్లా ఉపయోగపడుతుంది. వాళ్లలో ఫ్రెండ్లీ నేచర్ పెరుగుతుంది. నలుగురితో మాట్లాడి బాధలను పంచుకోగలుగుతారు. దాని వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెప్పింది కృతుంగ.
రోజూ ఉదయం ఐదింటికి మేడమ్ వస్తుంది. మొదట వ్యాయామం చేయిస్తుంది. తరువాత డాన్స్ క్లాస్ ఉంటుంది. దీని వల్ల శరీరం కొంత ఫిట్గా మారింది. తప్పు చేశాననే భావం, నా కుటుంబం ఎలా బతుకుతోందో అన్న బెంగతో నేను సరిగ్గా నిద్రపోయి నాలుగేండ్లు అయింది. డాన్స్ క్లాస్లకు వెళ్తున్నప్పటి నుంచి మనసు తేలిక పడింది. ఇప్పుడు నేను మామూలుగా నిద్రపోగలుగుతున్నా’
అని జీవిత ఖైదు పడిన ప్రేమ్ కుమార్ అన్నాడు.