చండీఘర్: పంజాబ్లో జంట పేలుళ్ల వెనక బీజేపీ హస్తం ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ 2027 పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ చేస్తోన్న సన్నాహాలు అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎక్కడ పోటీ చేయాలనుకుంటే అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఆరోపించారు. ఓట్ల కోసం ఇకనైనా ఇలాంటి పనులు ఆపాలని చురకలంటించారు.
మంగళవారం (మే 5) రాత్రి గంటల వ్యవధిలోనే పంజాబ్లోని జలంధర్, అమృత్సర్లోని కీలక సైనిక స్థావరాల సమీపంలో రెండు భారీ పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. అమృత్సర్లోని ఖస్సా కంటోన్మెంట్ వెలుపల, జలంధర్లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించాయి. జలంధర్ పేలుడుకు స్కూటర్కు నిప్పంటుకోవడమే కారణమని పోలీసులు మొదట భావించినప్పటికీ.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండు పేలుళ్లలోనూ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను (IEDలు) ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కీలకమైన సైనిక స్థావరాలకు అత్యంత సమీపంలో పేలుళ్లు చోటు చేసుకోవడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్లకు గల కారణాలపై పంజాబ్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో జంట పేలుళ్లకు బీజేపీనే కారణమని సీఎం భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
