
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైద్య, నర్సింగ్ కాలేజీలను అందుకు మినహాయించారు. కరోనా కట్టడి కోసం రానున్న 2 వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. సినిమా హాళ్లలో సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, షాపింగ్ మాల్స్ లో ఏ సమయంలోనైనా 100 మందికి కంటే ఎక్కువగా ఉండరాదని స్పష్టం చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడమే కాకుండా, అదనంగా మరో రెండు గంటల పాటు పొడిగించాలని నిర్ణయించింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. ప్రజలు గుంపులు గుంపులుగా ఒకే దగ్గర ఉండకూడదని తెలిపింది పంజాబ్ ప్రభుత్వం.