
- రష్యా అధ్యక్షుడు పుతిన్ కామెంట్
- ఉక్రెయిన్ తో వార్.. పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన
- ఇరాన్, ఇజ్రాయెల్ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచన
మాస్కో: రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే అని.. ఆ దిశగా ఆలోచిస్తే, ఉక్రెయిన్ మొత్తం తమకే చెందుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే, ఏ దేశ సార్వభౌమాధికారాన్ని కూడా రష్యా వ్యతిరేకించలేదని చెప్పారు. తాము చేసిన శాంతి ప్రతిపాదనలను ఉక్రెయిన్ వ్యతిరేకించిందని, వివాదాస్పద భూభాగాల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు తిరస్కరించిందన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు చూస్తుంటే, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొరుగు దేశం ఉక్రెయిన్ తో యుద్ధం, ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, పశ్చిమాసియాలో అశాంతి వంటివి చూస్తుంటే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు నడుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
మాస్కోలో నిర్వహించిన 28వ సెయింట్ పీటర్స్ బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (ఎస్ పీఐఈఎఫ్) లో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను లైట్ గా తీసుకోకూడదన్నారు. ‘‘వివిధ దేశాల మధ్య తలెత్తిన వివాదాలకు శాంతియుత పరిష్కారం కావాలి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నన్ను ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ రెండు మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్ కియన్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి చెప్పాను.
అందుకు సంబంధించిన నేను చేసిన ప్రతిపాదనలు అమలు చేస్తారని ఆశిస్తున్నా” అని పుతిన్ పేర్కొన్నారు. అలాగే, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఆయన విమర్శించారు. వెస్టర్న్ కంట్రీస్ నుంచి అధికారం మారుతున్నదని అన్నారు. ‘‘అంతర్జాతీయ ఎకానమీలో జీ7 దేశాల వాటా తగ్గుతున్నది. అదే సమయంలో బ్రిక్స్ దేశాల షేర్ పెరుగుతున్నది. ఈ మార్పులు అనివార్యం. ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం రష్యా, చైనా కృషి చేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.
మాపై అణు బాంబు వేస్తే.. వారికి అదే చివరి తప్పు
రష్యా సైనికుడు అడుగుపెట్టిన ప్రతి భూభాగం కూడా తమ దేశానికే చెందుతుందని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ చర్య వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతాయి తప్ప తగ్గవన్నారు. ఒకవేళ రష్యాపై ఉక్రెయిన్ అణుబాంబు దాడి చేస్తే, వారికి అదే చివరి తప్పు అవుతుందని, తరువాత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘మాపై ఉక్రెయిన్ అణుబాంబు దాడిచేస్తే, మా స్పందన చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. రష్యాపై అణుబాంబు దాడి చేసే దుస్సాహసానికి ఉక్రెయిన్ పాల్పడకపోవచ్చు” అని పుతిన్ చెప్పారు.
భారత్ తో దీర్ఘకాలిక సహకారం
భారత్ తో పాటు కీలక భాగస్వామ్య దేశాలతో 2030లోపు దీర్ఘకాలిక సహకారం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ఆ దేశాలతో ఇదివరకే ఆ దిశగా ఒప్పందం కుదిరిందన్నారు. ‘‘ఆయిల్, గ్యాస్ ఎగుమతులను మరింత పెంచే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకోసం మా భాగస్వామ్య దేశాలతో సంబంధాలను పెంచుకుంటాం. వాణిజ్య అడ్డంకులను తొలగిస్తాం. సహకార రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం కల్పిస్తాం” అని పుతిన్ చెప్పారు.
ఈ సదస్సులో భారత్ తరపున రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు ఏఐదే అని పేర్కొన్నారు. రష్యా, భారత్ మధ్య ఆర్థిక బంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రష్యా ఫెడరల్ మంత్రులు, పారిశ్రామికవేత్తలతో వైష్ణవ్ భేటీ అయ్యారు.