ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు

ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. దేశ ప్రధానిగా, స్వతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా పీవీ నరసింహారావు దేశానికి పలువిధాలుగా సేవలు అందించారని కేసీఆర్ అన్నారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణకు చెందిన వాడు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని సీఎం అన్నారు. పీవీ సేవలను స్మరించుకోవడానికి శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

కేకే ఆధ్వర్యంలో కమిటీ

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం పార్లమెంటు సీనియర్ సభ్యుడు కే. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె వాణీదేవి, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజెందర్, కేటీ రామారావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో ఆరేడు మందిని కూడా కమిటీలో చేర్చుకోవాలని కేశవరావును సీఎం కేసీఆర్ కోరారు. కేశవరావు ఇంట్లో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కమిటీ మొదటి సమావేశం జరుగుతుంది. పీవీతో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులను సంప్రదించి.. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ కమిటీని కోరారు.

For More News..

గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

శాసనమండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్

కరోనాతో చనిపోయిన పోలీసులకు రూ. 3 లక్షల సాయం ప్రకటించిన ఫార్మా కంపెనీ