సెమీస్‌‌‌‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

సెమీస్‌‌‌‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

బాలి: బ్యాడ్మింటన్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో  సెమీఫైనల్‌‌‌‌కు క్వాలిఫై అయ్యింది. లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో వరుసగా రెండో విక్టరీతో నాకౌట్‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఖాయం చేసుకుంది. కానీ మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌, లక్ష్యసేన్‌‌‌‌ తమ ప్రత్యర్థుల చేతిలో ఓడగా..మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ఇండియా జోడీలు ఇంటిదారి పట్టాయి.  గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–ఎ సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సింధు 21–10, 21–13తో యువానీ లీ(జర్మనీ)పై గెలిచింది. కానీ, మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌ 18–21, 7–21తో కున్లావుట్‌‌‌‌ విటిడ్సర్న్‌‌‌‌(థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడాడు. శుక్రవారం జరిగే థర్డ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సెకండ్ సీడ్‌‌‌‌ లీ జి జియ (మలేసియా)పై గెలిస్తేనే శ్రీకాంత్‌‌‌‌ సెమీస్‌‌‌‌ చేరుతాడు. 

ఇక,  గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 15–21, 14–21తో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ విక్టర్‌‌‌‌ ఆక్సెల్సెన్‌‌‌‌(డెన్మార్క్‌‌‌‌) చేతిలో ఓడాడు. కానీ ఈ గ్రూప్‌‌‌‌ నుంచి ఇద్దరు ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో విక్టర్‌‌‌‌తో పాటు లక్ష్య ఇప్పటికే సెమీస్‌‌‌‌ చేరాడు. కాగా, మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌– చిరాగ్‌‌‌‌  పోరాటం ముగిసింది. సాత్విక్‌‌‌‌కు గాయం అవడంతో  గురువారం జరగాల్సిన మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రత్యర్థికి వాకోవర్‌‌‌‌ లభించగా.. ఇండియా జోడీ టోర్నీ నుంచి ఔటైంది. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో అశ్విని – సిక్కి రెడ్డి జోడీ 19–21, 20–22తో గాబ్రియెల్లా– స్టిఫానీ(బల్గేరియా) చేతిలో ఓడి నాకౌట్‌‌‌‌ రేసు నుంచి తప్పుకుంది.