
- ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి
బషీర్బాగ్, వెలుగు: మహిళా కార్యకర్తలపై గచ్చిబౌలి పోలీసుల దాడి అమానుషమని ప్రగతిశీల మహిళా సంఘం (పీడబ్ల్యూఓ) తీవ్రంగా ఖండించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం పీడబ్ల్యూఓ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ మాట్లాడారు. అమెరికా మద్దతుతో పాలస్తీనా, ఇరాన్పై జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఇటీవల గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ ముందు నిరసన తెలుపుతున్న పీడబ్ల్యూఓ జాతీయ నాయకురాలు వి. సంధ్య, ఇతర మహిళా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారన్నారు.
వృద్ధులైన సాదినేని వేములపల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి వెంకటరామయ్య కూడా గాయపడ్డారన్నారు. నిరసనకారులతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడబ్ల్యూఓ ప్రతినిధులు డి. స్వరూప, అందె మంగ, పి. పద్మ, సీహెచ్. భారతి, ఉమెన్ ట్రాన్స్జెండర్ జేఏసీ ప్రతినిధులు కె. సజయ, ఎన్. అరుణ తదితరులు పాల్గొన్నారు.