
బషీర్ బాగ్, వెలుగు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలని, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న చలో ఢిల్లీ చేపడుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
76 ఏళ్లుగా బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాధాన్యం లేకపోతే బిల్లుకు సార్థకత లేదన్నా రు. ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లును లోక్ సభలోనూ ఆమోదింప చేయాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆది మల్లేష్ పటేల్, నీల వెంకటేష్, డి.రాజ్ కుమార్, అనంతయ్య, శ్రీనివాస్, గంగాభవాని, పృథ్వీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.