ఓబీసీ కుల గణన చేపట్టాలి

ఓబీసీ కుల గణన చేపట్టాలి

న్యూఢిల్లీ, వెలుగు: జన గణనలో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంట్​లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా.. గొర్రెలు, బర్రెలు, పందులు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. 

శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ నేత గుజ్జు కృష్ణ, ఎన్.మారేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, వీహెచ్​ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. 

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని 30 ఏండ్లుగా పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగ రూపకల్పన టైంలోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు పెడితే ఆయా వర్గాల్లో ఎంతో ప్రగతి జరిగేదని వివరించారు. బీసీల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్​ను తొలగించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.