
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఏప్రిల్ 12వరకు రిమాండ్ పొడిగించింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఇవాళ్టితో రాధా కిషన్ రావు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ సందర్భంగా చంచల్ గూడ జైలులో జైలు సూపరిండెంట్ ను కలవనివ్వడం లేదని.. లైబ్రరీకి వెళ్లనివ్వడం లేదంటూ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకోచ్చారు రాధా కిషన్ రావు. సూపరిండెంట్ ను కలిసేందుకు అలాగే.. లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మేజిస్ట్రేట్ ఆదేశించింది. అనంతరం రాధా కిషన్ రావును చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
మరోవైపు ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.