హైదరాబాద్, వెలుగు:కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ తన నివాసాన్ని హైదరాబాద్కు మార్చుకుంటున్నరా..?! ఔను.. త్వరలోనే ఆయన ఇక్కడికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు నిర్వహించే ఆలోచనలో రాహుల్ ఉన్నారట. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్ర బిందువు. అనువైన వాతావరణంతోపాటు అన్ని వసతులుండటంతో దక్షిణాది విడిదిగా ఇక్కడే మకాం ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. తనతో పాటు తన తల్లి సోనియాగాంధీ కూడా కొంతకాలం ఇక్కడే ఉండేందుకు వీలుగా రాహుల్ అన్ని సదుపాయాలున్న ఇంటిని అన్వేషించే పనిలో పడ్డట్లు సమాచారం. సెక్యూరిటీ యాంగిల్లోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ తన ఆలోచనను పంచుకున్నట్లు తెలిసింది.
ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్న రెసిడెన్స్ చూసుకోవాలా..? సరైన స్థలం ఎంచుకొని అన్ని హంగులతో కొత్త భవనం కట్టుకోవాలా..? అనే ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో కీ రోల్లో ఉన్న లీడర్ ఇప్పటికే రాహుల్కు ఇంటిని వెతికి పెట్టే పనిలో ఉన్నారని ఆ లీడర్ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నెలలోనే హైదరాబాద్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు సోనియాతో పాటు రాహుల్ హాజరు కానున్నారు. అదే సందర్భంగా బోయినపల్లిలో రాజీవ్గాంధీ ఐడియాలజీ సెంటర్ కు భూమిపూజ చేస్తారు. అక్కడున్న ఎనిమిది ఎకరాల స్థలంలో మోడర్న్ గెస్ట్ హౌస్ నిర్మించే ప్లాన్ కూడా ఉందని కాంగ్రెస్రాష్ట్ర ముఖ్య నేతలు చెప్తున్నారు. సోనియా, రాహుల్ నివాసముండేలా ఈ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అయితే.. అక్కడే రాహుల్ రెసిడెన్సీ ఉంటుందా..? మరోచోట వెతికి పెడుతారా..? అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.