బీసీ కోటా కోసం పార్లమెంట్లో కొట్లాడ్తం.. 50% రిజర్వేషన్ల క్యాప్ను తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ

బీసీ కోటా కోసం పార్లమెంట్లో కొట్లాడ్తం.. 50% రిజర్వేషన్ల క్యాప్ను తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ
  • రాష్ట్ర  ప్రభుత్వం బిల్లులు పంపితే బీజేపీ అడ్డుకుంటున్నది
  • తెలంగాణలోని కుల‌‌‌‌గ‌‌‌‌ణ‌‌‌‌న.. దేశానికి మైలురాయి
  • నా అంచనాలకు మించి సర్వేను సీఎం రేవంత్​ టీమ్​ పూర్తి చేసింది
  • 21వ శతాబ్దపు పవర్ పుల్ డేటా తెలంగాణ సొంతం.. ఈ డేటాతో అన్నివర్గాలకూ న్యాయం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇంగ్లిష్​ను దూరం చేసే కుట్ర
  • బీజేపీ నేతల పిల్లలకేమో ఇంగ్లిష్​ మీడియం చదువులా?
  • బడుగు బలహీనవర్గాలు బాగుపడ్తే బీజేపీకి నచ్చదని ఫైర్​
  • తెలంగాణ కులగణనపై ఏఐసీసీ ఆఫీసులో ప్రజంటేషన్​ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశంలో సామాజిక న్యాయానికి మైలురాయి లాంటిదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘కులగణనను నా అంచనాలకు మించి  సీఎం రేవంత్​రెడ్డి, ఆయన టీమ్​ సమర్థవంతంగా పూర్తి చేసింది” అని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే కులగణనను తెలంగాణ విధానంలో జరపాలని ఆయన డిమాండ్​ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చేసి పంపితే.. బీజేపీ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. ఈ అంశంపై సీఎం రేవంత్​కు మద్దతుగా పార్లమెంట్​లో పోరాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టి న కులగణన సర్వేపై గురువారం ఏఐసీసీ ఆఫీస్​ ఇందిరా భవన్​లో దేశవ్యాప్త కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్​ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్​, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికా ర్జున ఖర్గే, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ ​కుమార్ ​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్​గాంధీ మాట్లాడారు. 

ప్రజలకు జరిగే మేలును అడ్డుకోవడమే బీజేపీ పని

దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కాంగ్రెస్​ పార్టీ నిరంతరం ఆలోచిస్తున్నదని, అందుకోసం పోరాటం చేస్తున్నదని రాహుల్ ​గాంధీ తెలిపారు.  తెలంగాణ‌‌లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ఆలోచ‌‌న‌‌లు చేస్తుంటే.. అడ్డుకోవాల‌‌ని బీజేపీ చూస్తు న్నదని ఆయన మండిప‌‌డ్డారు. సామాజిక, ఆర్థిక అంశంతో పాటు రాజకీయంగానూ దేశ ప్రజలకు మేలు చేసే ఇలాంటి కులగణన సర్వే అంటే బీజేపీకి నచ్చదని.. విద్యా, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఆ పార్టీ వ్యతిరేకిస్తుంటుందని విమర్శించారు. హిందూత్వం పేరుతో రాజకీయ విధ్వంసం సృష్టిస్తున్నదని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మాత్రమే కాదు.. బీజేపీ వాళ్లకు కూడా తెలుసన్నారు. 

21వ శతాబ్దపు పవర్ పుల్ డేటాతెలంగాణ సొంతం

కులగణన సర్వేలో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలు తలుపులు తెరిచారని రాహుల్​ గాంధీ అన్నారు. ఆస్తులు, విద్యార్హతలు, సామాజిక వర్గం వంటి మొత్తం 56 ప్రశ్నలతో కుటుంబంలోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని సేకరించినట్లు వివరించారు. కానీ, అక్కడి ప్రతిపక్షాలు మాత్రం సక్రమంగా కులగణన చేయలేదని విమర్శిస్తున్నాయని ఫైర్​ అయ్యారు. అలాంటి వారందరి  కోసం మరోసారి అవకాశం కల్పిస్తామని, వారంతా ముందుకు వస్తా రా? అని చురకలంటించారు. 

1950, 60, 70 దశకాల్లో పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తే.. ఆయిల్ అనే సమాధానం వచ్చేదని రాహుల్  అన్నారు. ఆ అయిల్​నే ప్రజలు బ్లాక్ గోల్డ్ గా పిలుస్తారని తెలిపారు. ‘‘ఏ దేశమైతే ఆయిల్​ను కలిగి ఉందో.. గ్లోబల్​గా ఆ దేశమే ఆధిపత్యాన్ని కలిగి ఉండేది. ఇదే ప్రశ్నను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్​ను అడిగితే.. ఈ కాలం ఆధిపత్యం డేటా(సమాచారం) అని చెప్తారు. 

అలాంటి 21 వ శతాబ్ధానికి కావాల్సిన సోషల్, ఎకనమిక్, పొలిటికల్, ఫైనాన్షియల్ డేటా తెలంగాణ ప్రభుత్వ సొంతం. ఈ డేటాతో గ్రామీణ, జిల్లా స్థాయిల్లో సామాజిక, ఆర్థిక, ఎడ్యుకేషన్, హెల్త్.. ఇలా ఏ సెక్టార్​లో అయినా అభివృద్ధి ఫలాలు అందిం చవచ్చు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి టార్గెట్ డెవలప్మెంట్ అందించే అవకాశం దేశంలోని ఇతర ఏ రాష్ట్రానికి దక్కలేదని, అది తెలంగాణకే దక్కినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఆయన తెలిపారు. 

బీజేపీ నేతల పిల్లలకేమో ఇంగ్లిష్​ చదువులు..మన పిల్లలకు వద్దా?

దేశ అభివృద్ధికి డబ్బు, భూములు ముఖ్యం కాదని.. ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ ముఖ్యమని రాహుల్ ​గాంధీ అన్నారు. ఈ విషయం తెలంగాణలో చేపట్టిన కులగణనలో స్పష్టంగా వెల్లడైందని ఆయన తెలిపారు. ‘‘ఇంగ్లిష్ అత్యంత పవర్ పుల్. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేకు ముందు భూములే విలువైనవని నేను భావించే వాణ్ణి. కానీ, ఇంగ్లిష్ ప్రాధాన్యమైనదని కులగణన ఎక్స్ పర్ట్స్ కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. 

ప్రస్తుతం ప్రాంతీయ భాషలు, హిందీ ఉన్నప్పటికీ.. ఇంగ్లిష్ కూడా ఎంతైనా అవసరం. అలా అని హిందీ, ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. హిందీ, తమిళ్, కన్నడ ఇలా ఏ ప్రాంతీయ భాష తీసుకున్నా.. దాని తర్వాత ఇంగ్లిష్​ను తప్పక బోధించాలన్నారు. ‘‘ఈ విషయంలో ఏ బీజేపీ నేత దగ్గరకి పోయి అడి గినా.. ఇంగ్లిష్ వద్దంటారు. అయితే, ఏ స్కూల్​లో, ఏ కాలేజీలో మీ పిల్లలు చదువుతున్నారని వాళ్లను నిలదీస్తే.. ఆన్సర్ తప్పకుండా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో, ఇంగ్లిష్​ మీడియం కాలేజీల్లో చదువుతున్నట్లు వస్తుంది. ఇంగ్లిష్​ మీడియంలో చదివే అవకాశాన్ని దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దూరం చేయాలన్నదే బీజేపీ నేతల ఆలోచన” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కులగణన డేటాతో జీవితాల్లో మార్పులు

కులగణన, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం తనకు, సీఎం రేవంత్ రెడ్డికి ప్రాధాన్యాంశాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ డేటాతో తెలంగాణ ప్రజ ల జీవితాల్లో మార్పులు తేవాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తాను నిరంతరం ఆలోచిస్తున్నట్లు తెలిపా రు. కానీ, తెలంగాణలో జరుగుతున్న ఈ ఆలోచనను అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. 

‘‘తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, లోక ల్ బాడీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్​ను తొలగించేలా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపింది. కానీ, వీటిని బీజేపీ అడ్డుకుంటున్నది. సీఎం మద్దతుతో ఈ అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాడడమే ప్రస్తుతం మా ముందున్న కర్తవ్యం’’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఓబీసీల ఆంకాం క్షలు, కోరికలు నెరవేర్చేందుకు బీజేపీ తమతో కలిసి రావాలని ఆయన సూచించారు. ఈ దిశలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కూల్చాల్సిన అవసరం ఉందన్నారు.  

21 వ శతాబ్దానికి కావాల్సిన సోషల్, ఎకనమిక్, పొలిటికల్, ఫైనాన్షియల్ డేటా కేవలం తెలంగాణ ప్రభుత్వ సొంతం. కులగణన సర్వేతోనే ఇది సాధ్యమైంది. ఈ డేటాతో గ్రామీణ, జిల్లా స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందించవచ్చు. ఇది  తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుంది. - రాహుల్ ​గాంధీ

ఐడియాలజీ పోతదని బీజేపీ భయం

కేంద్రంలోని బీజేపీ సరైన పద్ధతిలో దేశవ్యాప్త కులగణన చేయబోదని రాహుల్ ​గాంధీ అన్నారు. ‘‘దేశంలోని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా వాస్తవ పరిస్థితులను బీజేపీ చెప్పదు. ఒకవేళ వాస్తవాలను దేశం ముందు పెడితే.. ఆ పార్టీ ఐడియాలజీ అంతమవుతుంది. ఆ భయంతోనే  కరెక్ట్​గా చెప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్త కులగణనకు తెలంగాణ కులగణన విధానాన్ని వలంబించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్నివర్గాల పట్ల బాధ్యతగా ఉంటుందని.. దళితులు, ఆదివాసీలు, బీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి సమస్య వచ్చినా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.