- నేడు రాహుల్, రేపు ఖర్గే, ఎల్లుండి ప్రియాంక
- జన జాతర సభలకు హాజరుకానున్న నేతలు
- 11తో ముగియనున్న ఎన్నికల ప్రచారం
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 11తో ప్రచార పర్వం ముగియనుంది. కేవలం మూడు రోజులే మిగిలి ఉండటంతో పార్టీ సీనియర్ లీడర్లు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. 9 నుంచి 11వ తేదీ వరకు రాహుల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. గురువారం రాహుల్ గాంధీ మెదక్లో ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ లో నిర్వహించే జన జాతర సభకు అటెండ్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీనగర్లోని సరూర్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు రాహుల్ హాజరుకానున్నారు.
అదేవిధంగా, శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తారు. 12 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడుతారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్లో నిర్వహించనున్న జన జాతర సభకు హాజరవుతారు. ఇక శనివారం, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న సభలో ఆమె పాల్గొని మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో నిర్వహించే సభకు హాజరవుతారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ల వెంట సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటారు.