ఇయ్యాల్టీ నుంచి కేరళలో రాహుల్ ప్రచారం

ఇయ్యాల్టీ నుంచి కేరళలో రాహుల్ ప్రచారం
  • 22 వరకు పార్టీ కార్యకర్తలతో  రోడ్ షోలు

తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నుంచి కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.15న సాయంత్రం ఉత్తర కోజికోడ్ జిల్లాలో జరిగే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తారు. 16న ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గంలోనే తనను గెలిపించాలని ప్రచారం చేస్తారు. 18న కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయం నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ర్యాలీలకు అటెండ్ అవుతారు. 22న త్రిస్సూర్, తిరువనంతపురం, అలప్పుజా జిల్లాల్లో  రోడ్ షోలు నిర్వహించి.. కార్యకర్తలను  ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

రాహుల్ తో పాటు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా కేరళలో  సుడిగాలి పర్యటన చేయనున్నారు. తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ నేత జోసెఫ్ వజక్కన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  2019 లోక్‌‌సభ ఎన్నికల్లో రాహుల్  వయనాడ్‌‌ నుంచి రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన అక్కడి నుంచే ఎన్నికల బరిలో దిగారు.