రైలు ప్రయాణికులపై స్టేషన్ల వినియోగ చార్జీ!

రైలు ప్రయాణికులపై స్టేషన్ల వినియోగ చార్జీ!

కొత్తగా స్టేషన్ల డెవలప్ మెంట్ ఫీజు (SDF),యూజర్ ఫీజు రూపంలో రుసుములను రైల్వే శాఖ వసూలు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో, విమానాశ్రయాలను తలపించే మాదిరిగా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. ఈ కాంట్రాక్టులను ప్రైవేట సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్నింటి అభివృద్ధి పూర్తి కాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి.

ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి రైలు ఎక్కి వెళ్లే వారు.. అలాగే ఈ స్టేషన్లలో రైలు దిగే వారి నుంచి SDFను రైల్వే శాఖ వసూలు చేయనుంది. రూ.10 నుంచి రూ.50 వరకు ఈ చార్జీ పడనుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఈ చార్జీ కూడా కలసిపోతుంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపి నోటిఫై చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ యూజర్ ఫీజును టికెట్ చార్జీలో బాగంగా  వసూలు చేస్తున్నారు.

అన్ని రకాల ఏసీ టికెట్లపై రూ.50, స్లీపర్ టికెట్ లపై రూ.25, అన్ రిజర్వ్ డ్ టికెట్లపై రూ.10 గా ఈ చార్జీ ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులపై ఈ చార్జీ ఉండదు. అంతేకాదు ఇలా అభివృద్దికి నోచుకున్న స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను కూడా రూ.10 పెంచనున్నారు. ఈ రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్టేషన్ల అభివృద్ధి, నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు సంస్థలు, రైల్వే పంచుకుంటాయి. ముందుగా 50 స్టేషన్లలో ఈ చార్జీలు అమల్లోకి తీసుకురానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని వార్తల కోసం...

 

డిగ్రీతో డిఫెన్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌