చేర్యాలను మళ్లీ నియోజకవర్గం చేస్తాం: రాజగోపాల్​రెడ్డి

చేర్యాలను మళ్లీ నియోజకవర్గం చేస్తాం: రాజగోపాల్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా మార్చడంతో పాటు మళ్లీ నియోజకవర్గం చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్​ పార్టీ భువనగిరి కో ఆర్డినేటర్​ కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి టెంపుల్​లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి పూజలు చేశారు. తర్వాత చేర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్​ సెంటర్​లో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్​ కేసులో బీఆర్​ఎస్​ఎమ్మెల్యేల సభ్యత్వాలు కోర్టు ఆదేశానుసారం రద్దు కాబోతున్నాయని, ఇలాంటి  కేసు దేశంలోనే మొదటిది కాబోతుందన్నారు. హరీశ్​రావు రాజీనామా చేయా ల్సిన అవసరం లేదని, కాళేశ్వరం కేసులో జైలుకు పోతాడని, అప్పుడు రాజీనామా చేసినా చేయకపో యినా ఒక్కటేనన్నారు. 

తపాస్​పల్లి నీళ్లను గజ్వేల్​, సిద్దిపేటకు తరలించుకుపోయిన కేసీఆర్​ను చేర్యాల ప్రజలు నమ్మరన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించిన 10 రోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​రెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్​రెడ్డి జనగామ నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచాడని, దీనిని బహిరంగంగా నిరూపిస్తే మాజీ మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే పల్లా రాజీనామా చేస్తారా అని సవాల్​ విసిరారు. చేర్యాల అంబేద్కర్ ​సెంటర్​లో చర్చకు సిద్ధమన్నారు. 

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్​రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి, రాకేశ్​రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్​ మండల శ్రీరాములు, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, కౌన్సిలర్లు నరేందర్​, లింగం, ఇన్నమ్మ భాస్కర్​రెడ్డి, తారా యాదగిరి, పట్టణ అధ్యక్షుడు చిరంజీవులు, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, శ్రీనివాస్, టెంపుల్​కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.