రాజాసింగ్ పై కేసులు నమోదు చేసి, జైలుకి పంపాలి

రాజాసింగ్ పై కేసులు నమోదు చేసి, జైలుకి పంపాలి

రాజాసింగ్ భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మహమ్మద్ ప్రవక్తపై ఆయన అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఓవైసీ..  అందువల్లనే పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. బీజేపీ వల్ల నగరంలో అశాంతి నెలకొందని విమర్శించారు. రాజాసింగ్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా తాను చేసిన వీడియోలో ఏ మతాన్నీ కించపరచలేదని, తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని రాజా సింగ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.అలాగే 10 రోజుల్లో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.