V6 News

Tollywood Editor: ప్రముఖ ఎడిటర్ కన్నుమూత.. 40 ఏళ్లకే గుండెపోటు.. జల్సా ట్రైలర్ కట్ చేసింది ఇతనే

Tollywood Editor: ప్రముఖ ఎడిటర్ కన్నుమూత.. 40 ఏళ్లకే గుండెపోటు.. జల్సా ట్రైలర్ కట్ చేసింది ఇతనే

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ ఎడిటర్ మధు రెడ్డి (40) కన్నుమూశారు. శనివారం ఏప్రిల్ 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధు రెడ్డి తనదైన ఎడిటింగ్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసి మధు రెడ్డి పేరుపొందారు.

ముఖ్యంగా ‘జగడం’, ‘జల్సా’ సినిమాల ట్రైలర్స్ ఆయన ఎడిటింగ్ ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాల ట్రైలర్ తోనే ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. అలా ఎన్నో సినిమాల సక్సెస్ వెనుక ఆయన పరోక్షంగా ఉన్నారు.

అలాగే, అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘అహ నా పెళ్లంట’ సినిమాతో పాటుగా ‘దళం’, ‘దక్ష’, ‘జగమేమాయ’, ‘వాలెంటైన్స్ నైట్’ వంటి చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అగ్ని నక్షత్రం’ ఆయన చివరి మూవీ. ఏదేమైనా మంచి భవిష్యత్తు ఉన్న ఎడిటర్, కేవలం 40 ఏళ్ల వయసులోనే చనిపోవడం ఆయన కుటంబానికి తీరని లోటు. మధు రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని పెచ్చుపల్లి. మధుకు భార్య నీలిమ ఉన్నారు.