బెంగళూరు మళ్లీ గోవింద..రాజస్థాన్ విక్టరీ

బెంగళూరు మళ్లీ గోవింద..రాజస్థాన్ విక్టరీ

హ్యాట్రిక్‌‌‌‌ ఓటములతో సతమతమవుతున్న ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఆల్‌ రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌‌‌‌ కనబర్చిన రాజస్థాన్‌ రాయల్స్‌‌‌‌దే పైచేయి అయింది.  యంగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ ధాటికి రాయల్‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు స్టార్లు బ్యాట్లెత్తే యడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 రన్స్‌‌‌‌చేసింది. ఐపీఎల్లో 100వ మ్యాచ్‌ లో కెప్టెన్‌ గా బరిలో దిగిన విరాట్‌ కోహ్లీ (25 బంతుల్లో 3ఫోర్లతో 23) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పార్థివ్‌ పాటిల్‌ (41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌ తో 67) హాఫ్‌‌‌‌ సెంచరీతో రాణించగా.. స్టొయినిస్‌ (28 బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్‌ తో 31 నాటౌట్‌ ) ఫర్వాలేదనిపించాడు. గింగిరాలు తిరిగే బంతులతో ముప్పుతిప్పలు పెట్టిన మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ గోపాల్‌ 12 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం టార్గెట్‌ ఛేజింగ్  లో రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 రన్స్‌‌‌‌ చేసి సీజన్‌ లో తొలి విక్టరీ నమోదు చేసింది. బట్లర్‌ (43 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ తో 59) ఫిఫ్టీతో మెరిస్తే.. స్మిత్‌ (31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ తో 38) రాణించాడు. కాలం కలసిరానప్పుడు అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు.. రాయల్స్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ రెండో ఓవర్‌ లో బట్లర్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ ను బెస్ట్‌‌‌‌ ఫీల్డర్‌ గా పేరున్న విరాట్‌ వదిలేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు చక్కటి ఇన్నింగ్స్‌‌‌‌తో రాయల్స్‌‌‌‌ విజయంలో కీ రోల్‌ పోషించాడు.

బట్లర్బాధ్యతగా..

గత మ్యాచ్‌ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్‌ అజింక్యా రహానె (22), బట్లర్‌ పట్టుదలగా ఆడటంతో ..పవర్‌ ప్లే ముగిసేసరికి రాయల్స్‌‌‌‌ 55/0తో నిలిచింది. కోహ్లీ క్యాచ్‌ వదిలేయడంతో 7 రన్స్‌‌‌‌ వద్ద లైఫ్‌‌‌‌ దక్కించుకున్న బట్లర్‌ సైనీ బౌలింగ్‌ లో 2 ఫోర్లు కొడితే..మరుసటి ఓవర్లో రహానె మరో 2 ఫోర్లు బాదాడు. ఆతర్వాత సైనీ బౌలింగ్‌ లో చెరో 2 ఫోర్లతో చెలరేగారు.తొలి వికెట్‌ కు 60 రన్స్‌‌‌‌ జోడించాక చహల్‌ బౌలింగ్‌ లో రహానె ఔటయ్యాడు. ఆ తర్వాత స్మిత్‌ తో కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు డిపించాడు. 10 ఓవర్ల లో రాయల్స్‌‌‌‌ 80/1తో నిలిచింది. ఆ తర్వాత అలీ బౌలింగ్‌ లో బట్లర్‌ 4,6 బాదడంతో స్కోరు 100 దాటింది. జోరు మీదున్న బట్లర్‌ ను చహల్‌ ఔట్‌ చేసినా బెంగళూరు కష్టాలు తీరలేదు. త్రిపాఠి (23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ తో 34 నాటౌట్‌ )తో కలిసి స్మిత్‌ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌ లో 6 రన్స్‌‌‌‌ చేయాల్సి న స్థితిలో స్మిత్‌ వెనుదిరిగినా.. స్టోక్స్‌‌‌‌ (1నాటౌట్‌ ) తో కలిసి త్రిపాఠి టీమ్‌ ను గెలిపించాడు.

ఒకరి వెంట ఒకరు..

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుకు శుభారంభం దక్కింది. ఒత్తిడిలోకనిపించిన కోహ్లీ స్టార్టింగ్‌ లోనే ఎదురుదాడికి దిగడంతో పరుగులు సులువుగానే వచ్చాయి.కులకర్ణి బౌలింగ్‌ లో కోహ్లీ 2 ఫోర్లు కొడితే.. 6 బంతుల వ్యవధిలో పార్థివ్‌ 4 ఫోర్లు బాది స్కోరు పెంచే యత్నం చేశాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికిబెంగళూరు 48/0తో నిలిచింది. ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. అంతర్జా తీయ అనుభవం కూడా లేని స్పిన్నర్‌ గోపాల్‌ బంతులను తప్పుగా అంచనా వేసిన రన్‌ మెషీన్‌ కోహ్లీ బౌల్డ్‌‌‌‌ కాగా.. డివిలియర్స్‌‌‌‌ (13) అతడికే రిటర్న్‌‌‌‌ క్యాచ్‌ ఇచ్చాడు.. ఇక హెట్‌ మైర్‌ (1) కీపర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఆర్సీబీ తడబడింది. ఓవైపు పార్థివ్‌ పోరాడుతున్న మరోవైపునుంచి సరైన సపోర్ట్‌‌‌‌ లేకపోవడంతో పరుగుల రాక కష్టమైంది. వరుసగా 4 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో బెం గళూరు 12 ఓవర్లలో 80/3తో నిలిచింది. 13వ ఓవర్‌ లో పార్థివ్‌ 6,4తో జోరు పెంచే ప్రయత్నం చేసినా.. రాయల్స్‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో స్కోరుకు కళ్లెం వేస్తూ వచ్చారు. భారీ షాట్లు ఆడటంలో దిట్ట అయిన స్టొయినిస్‌ దాదాపు 10 ఓవర్లపాటు క్రీజులో నిలిచినా ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. అడపాదడపా బౌండ్రీలు బాదుతూ వచ్చిన పార్థివ్‌ ఆర్చర్‌ బౌలింగ్‌ రహానెకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో మొయిన్‌ అలీ (9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ తో 18 నాటౌట్‌ ) బ్యాట్‌ కు పనిచెప్పడంతో ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.