ట్రాక్ లోకి రాయల్స్.. కేకేఆర్ పై 6 వికెట్లతో విక్టరీ

ట్రాక్ లోకి రాయల్స్.. కేకేఆర్ పై 6 వికెట్లతో  విక్టరీ

పాయింట్స్‌‌ టేబుల్లో చివరి రెండు ప్లేస్‌‌ల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌దే  పైచేయి అయింది. నాలుగు మ్యాచ్‌‌ల్లో మూడింటిలో ఓడి డీలా పడ్డ రాయల్స్‌‌ కీలక సమయంలో  పంజా విసిరింది. లీగ్‌‌లో తమలాగే తడబడుతున్న కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌పై గెలిచి ట్రాక్‌‌లో పడింది.  ఆల్‌‌రౌండర్‌‌ క్రిస్‌‌ మోరిస్‌‌ (4/23) అద్భుత బౌలింగ్‌‌తో చెలరేగిన వేళ హార్డ్‌‌ హిట్టర్లతో కూడిన కోల్‌‌కతాను తక్కువ స్కోరుకే  పరిమితం చేసిన రాజస్తాన్‌‌ చిన్న టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేసి లీగ్‌‌లో రెండో విక్టరీ అందుకుంది..! మరోవైపు గత పోరులో ధనాధన్‌‌ షాట్లతో చెన్నైని వణికించిన కోల్‌‌కతా బ్యాట్స్‌‌మెన్‌‌ రాయల్స్‌‌ బౌలర్ల ముందు తేలిపోయారు. చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునేందుకు బౌలర్లు కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో  వరుసగా నాలుగో ఓటమితో కేకేఆర్‌‌ మరింత డీలా పడింది..!
ముంబై:అటు బౌలింగ్‌‌, ఇటు బ్యాటింగ్‌‌లో సత్తా చాటిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ మళ్లీ గెలుపు బాట పట్టింది.  కోల్‌‌కతా మరోసారి నిరాశ పరిచింది. శనివారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో  రాయల్స్‌‌ ఆరు  వికెట్ల తేడాతో కేకేఆర్‌‌ను ఓడించింది. ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన కోల్‌‌కతా 133/9 స్కోరు మాత్రమే చేసింది. రాహుల్‌‌ త్రిపాఠి (26 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 36) టాప్‌‌ స్కోరర్‌‌. దినేశ్‌‌ కార్తీక్‌‌ (25), నితీశ్‌‌ రాణా (22) ఫర్వాలేదనిపించారు. రాయల్స్‌‌ బౌలర్లలో మోరిస్‌‌తో పాటు ముస్తాఫిజుర్‌‌ (1/21), ఉనాద్కట్ (1/25), చేతన్‌‌ సకారియా (1/31) ఆకట్టుకున్నారు. అనంతరం 18.5 ఓవర్లో 4 వికెట్లకు 134  రన్స్‌‌ చేసిన రాజస్తాన్‌‌ ఈజీగా గెలిచింది. కెప్టెన్‌‌ సంజు శాంసన్‌‌ (41 బాల్స్‌‌లో 2 ఫోర్స్‌‌, 1 సిక్సర్‌‌తో 42 నాటౌట్‌‌)  సత్తా చాటాడు.  మోరిస్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

కేకేఆర్‌‌ తడబ్యాటు..

ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన కోల్‌‌కతా ఇన్నింగ్స్‌‌ చాలా చప్పగా సాగింది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో చెన్నైపై చెలరేగి ఆడిన బ్యాట్స్‌‌మెన్‌‌ ఈసారి ప్రభావం చూపలేకపోయారు. పవర్‌‌ప్లేలో 25 రన్సే చేసి ఓ వికెట్‌‌ కోల్పోయిన ఆ జట్టు11 ఓవర్లకు 62/4తో నిలిచింది. మరోవైపు ఫస్ట్ ఓవర్‌‌ నుంచే రాజస్తాన్‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేసింది. స్టార్టింగ్‌‌లో ఉనాద్కట్‌‌, సకారియా, ముస్తాఫిజుర్‌‌ ఆకట్టుకుంటే స్లాగ్‌‌ ఓవర్లలో క్రిస్‌‌ మోరిస్‌‌ సూపర్‌‌ బౌలింగ్‌‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. పవర్‌‌ప్లేలో రాయల్స్‌‌ పేసర్లు  పేస్‌‌లో మార్పులు చేస్తూ, పర్‌‌ఫెక్ట్‌‌ బాల్స్‌‌ వేస్తూ ఓపెనర్లు నితీష్‌‌ రాణా, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (11)పై ప్రెజర్‌‌ పెంచారు. నాలుగో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గిల్‌‌.. ముస్తాఫిజుర్‌‌ బౌలింగ్‌‌లోనే లేని సింగిల్‌‌ కోసం ట్రై చేసి రనౌటయ్యాడు. ఉనాద్కట్‌‌ వేసిన ఏడో ఓవర్లో త్రిపాఠి ఫోర్‌‌, నితీశ్‌‌ సిక్సర్‌‌ కొట్టి ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, తొమ్మిదో ఓవర్లో చేతన్‌‌ సకారియా షార్ట్‌‌ బాల్‌‌ను వెంటాడిన రాణా.. కీపర్‌‌ శాంసన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే జైస్వాల్‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌కు సునీల్‌‌ నరైన్‌‌ (6) ఔటవడంతో  సగం ఓవర్లకు కేకేఆర్‌‌ 55/3తో నిలిచింది. ఆ తర్వాత కూడా నైట్‌‌ రైడర్స్‌‌ తడబాటు కొనసాగింది. మోరిస్‌‌ వేసిన 11వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌నే రాహుల్‌‌ త్రిపాఠి స్కూప్‌‌ షాట్‌‌తో ఫైన్‌‌ లెగ్‌‌ మీదుగా సిక్స్‌‌ కొట్టినా.. నెక్స్ట్‌‌బాల్‌‌కే  రన్‌‌కు పిలిచి మళ్లీ వద్దని కెప్టెన్‌‌ ఇయాన్‌‌ మోర్గాన్‌‌ (0) రనౌట్‌‌కు కారణమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌‌ కార్తీక్‌‌తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తెవాటియా బౌలింగ్‌‌లో రాహుల్‌‌ సిక్స్‌‌ కొట్టగా.. కార్తీక్‌‌ రెండు ఫోర్లతో వేగం పెంచాడు. దాంతో15 ఓవర్లకు  93/4తో నిలిచిన కేకేఆర్‌‌ 150 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలోనూ జోరు కొనసాగించిన రాయల్స్‌‌ బౌలర్లు.. ప్రత్యర్థి స్పీడుకు బ్రేకులు వేశారు. 16వ ఓవర్లో  త్రిపాఠిని ముస్తాఫిజుర్‌‌ ఔట్‌‌ చేశాడు. గత మ్యాచ్‌‌లో ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో అలరించిన  కార్తీక్‌‌, రసెల్‌‌ (9), కమిన్స్‌‌ (10)తో పాటు శివం మావి (5) వికెట్లు పడగొట్టిన మోరిస్‌‌ కేకేఆర్‌‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. 

రాయల్స్‌‌ నిదానంగా

ఛేజింగ్‌‌లో రాయల్స్‌‌ నిదానంగా ఆడింది. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డా టార్గెట్‌‌ చిన్నదే కావడంతో గెలుపు సొంతం చేసుకుంది.  జోస్‌‌ బట్లర్‌‌ (5) నిరాశ పరిచినా.. సీజన్‌‌లో ఫస్ట్‌‌ టైమ్‌‌ బరిలోకి దిగిన యంగ్‌‌ ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ (17 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 22) క్రీజులో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు.  క్లాసిక్‌‌ డ్రైవ్స్‌‌తో బౌండ్రీలు కొడుతూ అలరించాడు.  ఐదో బాల్‌‌కే గిల్‌‌ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో లైఫ్‌‌ దక్కిన జైస్వాల్‌‌.. కమిన్స్‌‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు బౌండ్రీలతో కాన్ఫిడెన్స్‌‌ పెంచుకున్నాడు. కానీ, అదే ఓవర్లో షార్ట్‌‌ బాల్‌‌ హెల్మెట్‌‌కు తగలడంతో ఇబ్బంది పడ్డ బట్లర్‌‌.. నాలుగో ఓవర్లో స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి ఫస్ట్‌‌ బాల్‌‌కే ఎల్బీ అయ్యాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కెప్టెన్‌‌ శాంసన్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌నే బౌండ్రీకి చేర్చగా.. జైస్వాల్‌‌ ఇంకో ఫోర్‌‌ రాబట్టాడు. మావి బౌలింగ్‌‌లోనూ ఇద్దరూ చెరో ఫోర్‌‌ రాబట్టారు. కానీ, మరో షాట్‌‌కు ట్రై చేసిన యశస్వి క్యాచ్‌‌ ఔట్‌‌ అయ్యాడు. శివం దూబే (18 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 22)  వచ్చీరాగానే నరైన్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్స్‌‌ కొట్టడంతో పవర్‌‌ప్లేలోనే రాయల్స్‌‌ స్కోరు 50 దాటింది. శాంసన్‌‌తో పాటు దూబే క్రీజులో కుదురుకోగా.. పది ఓవర్లకు రాజస్తాన్‌‌ 80/2 తో నిలిచింది. తర్వాతి ఓవర్లో దూబేను చక్రవర్తి  ఔట్‌‌ చేయగా... సంజు, తెవాటియా (5) కాసేపు జాగ్రత్త పడ్డారు. దాంతో రన్‌‌రేట్‌‌ తగ్గింది. స్కోరు వంద దాటినవెంటనే ప్రసిధ్‌‌ బౌలింగ్‌‌లో తెవాటియా కూడా ఔటవడంతో రాయల్స్‌‌పై కాస్త ఒత్తిడి పెరిగింది. అయితే, శాంసన్‌‌కు తోడైన మిల్లర్‌‌ (23 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 24 నాటౌట్‌‌) ప్రత్యర్థికి చాన్స్‌‌ ఇవ్వకుండా టార్గెట్‌‌ను కరిగించాడు.