రైళ్లలో ఇక హిజ్రాల ఆటలు సాగవు

రైళ్లలో ఇక హిజ్రాల ఆటలు సాగవు

న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు హిజ్రాలు బెదిరించి డబ్బులు అడుక్కోవడంపై సరైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైళ్లలో ట్రాన్స్ జెండర్లు డబ్బులు వసూలు చేయకూడదని తెలిపింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంవత్సరంలోనే 20 వేల ట్రాన్స్‌జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది.

2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది.  రైల్వే శాఖ చర్యలతో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు సంతోషం తెలుపుతున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం హిజ్రాలకు అలవాటైందని సీరియస్ అవుతున్నారు.