
- సూర్యాపేటలో వెలుగు చూసిన ఘటన
సూర్యాపేట, వెలుగు : రేషన్ బియ్యం పంపిణీలో ఓ డీలర్ చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం పంపిణీ చేశాడు. సూర్యాపేట జిల్లాలో రెండు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్టేట్ విజిలెన్స్ టీమ్ ఎంక్వైరీ మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట పట్టణానికి చెందిన జన్నపాల అనురాధ అనే మహిళ బుధవారం రేషన్ షాప్ నంబర్ 45లో మూడు నెలలకు సంబంధించి 52 కిలోల బియ్యం తీసుకుంది.
ఇంటికి వెళ్లి చూడగా సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం ఉన్నాయి. ఇదే విషయాన్ని రేషన్ డీలర్ను ప్రశ్నించగా ఇచ్చింది తీసుకోవాలంటూ మహిళతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు మహిళ ఈ విషయాన్ని ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో పాటు తమ వార్డుకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసింది. వైరల్ కావడంతో రేషన్ డీలర్ దొడ్డు బియ్యం తీసుకొని తిరిగి సన్నబియ్యం ఇచ్చాడు.
సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం ఇచ్చిన విషయం తెలుసుకున్న స్టేట్ విజిలెన్స్ టీమ్ దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం విజిలెన్స్ డీఎస్పీ గోపాల్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు, సివిల్ సప్లై ఆఫీసర్లు సూర్యాపేటకు వచ్చి బాధిత మహిళతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రేషన్ షాప్లో స్టాక్ వివరాలను తీసుకున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గోపాల్ తెలిపారు.