
న్యూఢిల్లీ:మన రూపాయల్లో సరిహద్దు వాణిజ్యం కోసం దక్షిణాసియా దేశాలతో తామూ, ప్రభుత్వం చర్చిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కేంద్రంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్యం కోసం రూపాయి సెటిల్మెంట్ విధానాన్ని మొదలు పెట్టామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఐఎంఎఫ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మేం ప్రయోగాత్మకంగా సెంట్రల్బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని కూడా మొదలుపెట్టాం. డిజిటల్ రూపాయి లాంచ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే క్లోనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలోనూ దక్షిణాసియా దేశాల నుంచి సహకారం తీసుకోవచ్చు. వీటితో వ్యాపారాన్ని మరింత పెంచవచ్చు. దీనివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. కరోనా, ఇన్ఫ్లేషన్, రెసిషన్, రష్యా–యుద్ధం వంటి సమస్యలను దక్షిణాసియా దేశాలు ఎదుర్కోవాలి. యూపీఐ చెల్లింపుల కోసం నేపాల్తోపాటు భూటాన్ మాతో చేతులు కలిపింది. సరిహద్దు వాణిజ్యానికి కూడా యూపీఐని వాడుతాం. పోయిన నెల డిజిటల్ రూపాయిని కూడా మొదలుపెట్టాం” అని అన్నారు.
ఇన్ఫ్లేషన్పై దృష్టి పెట్టాలి
ఇండియా వంటి దక్షిణాసియా దేశాలకు ఇన్ఫ్లేషన్ కట్టడి చాలా ముఖ్యమని శక్తికాంత దాస్ ఈ సందర్భంగా అన్నారు. ధరలను అదుపులోకి తేకుంటే గ్రోత్కు, ఇన్వెస్ట్మెంట్లకు అడ్డుగోడగా నిలుస్తాయని చెప్పారు. పెరుగుతున్న అప్పులు, ధరలు దక్షిణాసియా దేశాల ఎకనమిక్ గ్రోత్కు అడ్డంకి అని, ఈ రెండింటినీ అదుపులోకి తేవాలని అన్నారు. వీటికి తోడు కరోనా కారణంగా వచ్చిన సప్లై చెయిన్ సమస్యలు, ఫుడ్ క్రైసిస్, యుద్ధం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వడ్డీ రేట్ల పెరుగుదల కూడా సమస్యలు తెచ్చిపెట్టాయని దాస్ వివరించారు. 2022 మూడు క్వార్టర్లలో ఆహార ధరలు 20 శాతానికిపైగా పెరిగాయని అన్నారు. ‘‘ ఇటీవల ఇండియాలో ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. సప్లై చెయిన్ సమస్యలూ తగ్గాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ దిగివస్తోంది. పెట్రో ప్రొడక్టుల కోసం విదేశాలపై మనం విపరీతంగా ఆధారపడుతున్నాం కాబట్టి ఆయిల్ఇన్ఫ్లేషన్ను తగ్గించడం చాలా కష్టం. సరైన మానిటరీ, ట్రేడ్ పాలసీ, సప్లై చెయిన్ ఇబ్బందులను తొలగించడం, పాలనా పరమైన మార్పులు ఇన్ఫ్లేషన్ను తగ్గించడానికి సాయపడతాయి” అని శక్తికాంత దాస్ వివరించారు.