ఢిల్లీ : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం ట్వీట్టర్ ద్వారా తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. పాజిటివ్ అని తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లినట్లు, తనను ఇటీవల కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత దాస్ సూచించారు. క్వారంటైన్లో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. తాను కరోనా బారిన పడినా.. ఆర్బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
