కొత్త రకం క్రెడిట్ కార్డ్ మోసం.. IRCTCలో టిక్కెట్స్ బుక్ చేయగానే రూ.42వేలు మాయం.. ఏమైందంటే?

కొత్త రకం క్రెడిట్ కార్డ్ మోసం.. IRCTCలో టిక్కెట్స్ బుక్ చేయగానే రూ.42వేలు మాయం.. ఏమైందంటే?

డిజిటల్ చెల్లింపులు పెరిగేకొద్దీ కేటుగాళ్ల మోసాలు కూడా సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా ఒక యువతి తన తండ్రి ఎదుర్కొన్న క్రెడిట్ కార్డ్ మోసం గురించి ఎక్స్ ఖాతాలో పంచుకున్న స్టోరీ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కేవలం ఒక రాత్రిలో ఫోన్ హ్యాక్ అవ్వడం, వేల రూపాయలు మాయమవ్వడం చూస్తుంటే సామాన్యులకు ఫైనాన్షియల్ సేఫ్టీ ఎక్కడ ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇషికా కేసర్వానీ అనే యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి మొబైల్ ఫోన్ అర్ధరాత్రి సమయంలో హ్యాక్ అయినట్లు కనిపించింది. వరుసగా ఓటీపీ అలర్ట్‌లు వస్తూనే ఉన్నాయి. తెల్లారి చూసేసరికి ఆయన RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి రూ.42వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కార్డును బ్లాక్ చేశారు. తీరా ఆరా తీస్తే.. ఆ డబ్బుతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా 'ప్లేస్టేషన్ గిఫ్ట్ కార్డ్స్' కొనుగోలు చేసినట్లు తేలింది. మోసం జరిగిన గంటల్లోనే బ్యాంకుకు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసినా.. బ్యాంక్ అధికారులు మాత్రం ఇది తమ పరిధిలోకి రాదని, రికవరీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో విసిగిపోయిన ఇషికా సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఆమె పోస్ట్ వైరల్ అవ్వడంతో బ్యాంక్ సోషల్ మీడియా టీమ్ వెంటనే స్పందించి.. ఫిబ్రవరి 27 లోపు డబ్బు రీఫండ్ చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ తన పోస్ట్ వైరల్ కాకపోయి ఉంటే.. బ్యాంక్ తన ఫిర్యాదును పట్టించుకునేదే కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సామాన్యుల ఫిర్యాదులపై బ్యాంకులు చూపుతున్న ఉదాసీనతకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ సైబర్ మోసంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు స్క్రీన్ మిర్రరింగ్ లేదా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఫోన్‌ను యాక్సెస్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇషికా మాత్రం తన తండ్రి ఎటువంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయలేదని, IRCTCలో టికెట్ బుక్ చేసిన వెంటనే ఇలా జరిగిందని ఆమె వెల్లడించారు. దీంతో డిజిటల్ యుగంలో మన కార్డులు ఎంత సేఫ్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. కార్డులపై డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ పెట్టుకోవడం, అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.