న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘హౌలిహాన్ లోకీ’ నివేదిక ప్రకారం ఆర్సీబీ బ్రాండ్ విలువ 312 మిలియన్లు (రూ. 2984 కోట్లు) దాటింది. ఈ మైలురాని చేరుకున్న తొలి క్రికెట్ జట్టుగా రాయల్ చాలెంజర్స్ నిలిచింది.
వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలవడం వల్ల ఆర్సీబీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. అదే టైమ్లో ఐపీఎల్ బిజినెస్ విలువ కూడా 20.6 బిలియన్ డాలర్లకు (రూ. 1.90 లక్షల కోట్లు) చేరింది. గతేడాదితో పోలిస్తే 11.4 శాతం పెరిగింది. ఐపీఎల్ సొంత బ్రాండ్ విలువ కూడా 10.3 శాతం వృద్ధితో 4.3 బిలియన్ డాలర్లకు చేరింది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విలువ రూ. 2525 కోట్లు కాగా, కోల్కతా నైట్రైడర్స్ విలువ రూ. 2348 కోట్లుగా ఉంది. చెన్నై సూపర్కింగ్స్ (రూ. 2334 కోట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (రూ. 1600 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ. 1540 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1514 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ. 1501 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 1492 కోట్లు), లక్నో సూపర్జెయింట్స్ (రూ. 1168 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
