రియల్ ఎస్టేట్పడిపోలే.. పెరిగింది.. ఫిబ్రవరిలో హైదరాబాద్లోనే 5,900 ఇండ్ల రిజిస్ట్రేషన్: మంత్రి శ్రీధర్ బాబు

రియల్ ఎస్టేట్పడిపోలే.. పెరిగింది.. ఫిబ్రవరిలో హైదరాబాద్లోనే 5,900 ఇండ్ల రిజిస్ట్రేషన్: మంత్రి  శ్రీధర్ బాబు
  •  పడిందనేటోళ్లు కండ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తయ్: శ్రీధర్ బాబు
  • రియల్​ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్​ రంగంలో 15.4 శాతం వృద్ధి
  • నిర్మాణ రంగం 11.97 శాతం పెరిగింది
  • టైమ్స్ హోం హంట్ ప్రాపర్టీ ఎక్స్​పో ప్రారంభించిన మంత్రి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రియల్​ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందంటున్న వాళ్లు ఒక్కసారి కళ్లు తెరిచి చూడాలని, అన్ని వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం ఏటేటా వృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. శనివారం (june 21) హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో ‘టైమ్స్​ హోం హంట్​ ప్రాపర్టీ ఎక్స్​పో 2025’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

2024–25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం నుంచే రూ.80 వేల కోట్లు సమకూరాయన్నారు.

 ‘‘తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రంగం వాటా 24.9 శాతం. ప్రస్తుతం రెరా దగ్గర 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇవి కేవలం లెక్కలు కాదు. కాంగ్రెస్​ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంప దెబ్బ’’ అని వివరించారు.

5,900 ఇండ్ల రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్ లోనే 5,900 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.కోటి, అంత కంటే ఎక్కువ ధర గల ఇండ్ల వాటా 18 శాతంగా ఉందన్నారు. ఈ తరహా ఇండ్ల కొనుగోలులో వార్షిక వృద్ధి రేటు 58 శాతంగా ఉందని నైట్​ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించిందని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తం. 

తొలి దశలో 4.16 లక్షలు ఇచ్చాం. ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌరవప్రదంగా జీవించాలనే సంకల్పంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగం అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. 

బిల్డర్లు, కొనుగోలుదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి’’ అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గండ్ర సత్యనారాయణ రావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.