టీఆర్ఎస్ లో మున్సిపల్ టికెట్ల దందా.!

టీఆర్ఎస్ లో మున్సిపల్ టికెట్ల దందా.!
  • హైదరాబాద్ శివారులో రూ. కోటిన్నర ఆఫర్
  • మరో చోట.. 3 కోట్ల విలువైన భూమి ఆఫర్
  • పార్టీకి డబ్బిస్తాం, మిగతా వారిని గెలిపిస్తాం
  • మేయర్, చైర్మన్​ తమకే ఇవ్వాలంటూ ప్రపోజల్స్​
  • జిల్లాల్లో  కౌన్సిలర్  టికెట్​ కోసం రూ. 50 లక్షలు
  • టికెట్ ఇవ్వకపోతే రెబల్​గా దిగుతామని బెదిరింపులు

హైదరాబాద్, వెలుగుమున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ టికెట్​ దక్కించుకునేందుకు రియల్టర్లు, వ్యాపారులు పోటీ పడుతున్నారు. మళ్లీ నాలుగైదేండ్ల దాకా ఎన్నికలు లేకపోవడంతో ఎట్లయినాజేసి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్​ ఇప్పిస్తే రూ. కోటి నుంచి కోటిన్నర దాకా ముట్టజెప్తామని కొందరు ఆఫర్​ ఇస్తున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టికెట్​ ఇచ్చినందుకు కొంత, పార్టీకి మరికొంత అని లెక్కలు చూపిస్తూ జోరుగా రియల్టర్లు, వ్యాపారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మేయర్ పదవి కానీ, మున్సిపల్​ చైర్​పర్సన్​ పదవి కానీ ఇవ్వాలని, అట్ల ఇస్తే మరో కోటి ఇస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ వారు చక్కర్లు కొడుతున్నారు. నేరుగా ఎమ్మెల్యేలను, మంత్రులను సంప్రదించే చాన్స్​ లేనివాళ్లు.. ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల సన్నిహితులను అప్రోచ్​ అవుతున్నారు. దీంతో ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతల పరిస్థితి ఏంటన్న చర్చ టీఆర్​ఎస్​ వర్గాల్లో ఉంది.

రియల్టర్ల హవా

హైదరాబాద్ శివారు, కొత్త జిల్లాల కేంద్రాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది.దీంతో కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారు. ఆ డబ్బుతో ఇప్పుడు రాజకీయ అరగ్రేటం చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ టికెట్​ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 10 మున్సిపాల్టీలు ఏర్పడ్డాయి. ఇక్కడ్నించి పోటీ చేసేందుకు పెద్ద పెద్ద రియల్టర్లు రెడీగా ఉన్నారు. వాళ్లు టికెట్​ కోసం స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కార్పొరేటర్​ లేదా కౌన్సిలర్ టికెట్ ఇస్తే కోటి నుంచి కోటిన్నర వరకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిసింది. మేయర్  లేదా చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఒప్పుకుంటే  మరింత డబ్బు ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు  సమాచారం. ఎమ్మెల్యేలను, మంత్రులను  మచ్చిక చేసుకునేందుకు టికెట్​ ఆశించే రియల్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేల సన్నిహితుల వద్దకు వెళ్లి తమ మనసులోని మాటను బయటపెడుతున్నారు. జిల్లా కేంద్రాల మున్సిపాలిటీల్లో కౌన్సిలర్​ టికెట్​ కోసం మాత్రం రూ. 50 లక్షలు ఆఫర్​ జేస్తున్నట్లు తెలుస్తోంది.

లేదంటే.. రెబల్​గా

ఇప్పుడు టికెట్ రాకపోతే మళ్లీ ఐదేండ్ల వరకు వేచి చూడాల్సి వస్తుందని, అప్పటివరకు ఓపిక లేదని, ఇప్పుడే అధికార పార్టీ   టికెట్​ దక్కించుకోవాలని రియల్టర్లు, వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే  రెబల్ గా నిలబడుతామని కొందరు రియల్టర్లు  బెదరింపులకు దిగుతున్నట్లు సమాచారం. తమ దగ్గర రియల్​ దందాలో సంపాదించిన డబ్బు ఉండటంతో ఎట్లయినా గెలుస్తామని కొందరు భావిస్తుంటే.. మరికొందరు గెలవకపోయినా పర్వాలేదని అంటున్నారు. టికెట్ కోసం బెదిరింపులకు కూడా దిగుతున్నారని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సన్నిహితుడు చెప్పారు.  ‘మొన్నటి వరకు మాతో కలిసి తిరిగిండు. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే.. రెబల్ గా నిలపడుతా అంటున్నడు. గెలవకున్నా పర్లేదంటున్నడు. మా అభ్యర్థిని ఓడిస్తా అంటున్నడు’ అని ఆయన వివరించారు.

ఖర్చు మీరే పెట్టుకోండి

మున్సిపోల్స్ లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ హైకమాండ్​ అప్పగించింది. ఎన్నికల ఖర్చులను  అడుగొద్దనే  కండిషన్ కూడా పెట్టినట్టు తెలిసింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు ఉన్న నేతలను గుర్తించి టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. టికెట్​ ఇచ్చే బాధ్యత తమదేనని, అందుకు రూ. 50లక్షల దాకా ఖర్చవుతుందని ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓ ఎమ్మెల్యే టికెట్​ ఆశిస్తున్న రియల్టర్​కు కండిషన్​ పెట్టారు.