కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఆక్రమణలపై కొరడా..జేసీబీలతో రోడ్లపై డబ్బాల తొలగింపు

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఆక్రమణలపై కొరడా..జేసీబీలతో రోడ్లపై  డబ్బాల తొలగింపు

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో అధికారులు ఉక్కుపాదం మోపారు. నగరంలో పాదచారుల భద్రతే ధ్యేయంగా... ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశారు. కేపీహెచ్‌బీ ప్రధాన రహదారుల పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారులు  కొరడా ఝులిపించారు

ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలంటూ అధికారులు ముందే హెచ్చరించడంతో... మెజారిటీ చిరువ్యాపారస్తులు తమకు తాముగానే స్వచ్ఛందంగా ఫుట్‌పాత్‌లపై ఉన్న డబ్బాలు, సామాగ్రిని ఖాళీ చేసి తీసుకెళ్లిపోయారు.

అయితే, హెచ్చరించినా వినకుండా అలాగే వదిలేసిన మిగిలిన అక్రమ డబ్బాలు, షాపులపై అధికారులు జేసీబీలతో విరుచుకుపడ్డారు. జేసీబీల సహాయంతో ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, పాదచారులకు నరకం చూపుతున్న ఇలాంటి ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లు నడవడానికే కానీ... వ్యాపారాలు చేసుకోవడానికి కాదని, ఇకపై ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.