ఆకాశానికి అద్దెలు.. మరి తగ్గేదెప్పుడు!

ఆకాశానికి అద్దెలు.. మరి తగ్గేదెప్పుడు!
  • మిడిల్​క్లాస్​ ఎదురుచూపులు
  • అన్ని మెట్రో సిటీల్లోనూ ఇదే పరిస్థితి
  • బెంగళూరులో  ఇండ్లు అద్దెకిచ్చేందుకు సైతం ఇంటర్వ్యూలు
  • ఏడాదిలో 40 శాతం పెరిగిన రెంట్​
  • ఉద్యోగులందరూ తిరిగి రావడంతో గిరాకీ

బిజినెస్​ డెస్క్​, వెలుగు: దేశంలోని ప్రధాన సిటీలలో అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక వైపు వర్క్​ఫ్రమ్​ హోమ్​ చాలు... ఆఫీసులకు రమ్మంటున్నాయి కంపెనీలు. మరోవైపు ఆకాశానికి చేరిన అద్దెలతో ఏం చేయాలో తోచని అయోమయం ఎదుర్కొంటున్నారు చాలా మంది ఉద్యోగులు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ప్రధానంగా ఒకటే డిస్కషన్​..అది పెరిగిన ఇంటి అద్దె గురించే. చాలా కంపెనీలు వర్క్​ఫ్రం హోమ్​ పాలసీకి ముగింపు పలకడమే ఈ అద్దెల పెరుగుదలకు ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు.

అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్​ తట్టుకోవడానికి మార్కెట్లో తగినన్ని ఆప్షన్స్​ కనబడటం లేదు. బెంగళూరు, ముంబై వంటి మెట్రోలలో అద్దెల పెరుగుదల భారీగా ఉండటంతోపాటు, అద్దెకు ఇండ్లు దొరకడమే కష్టమవుతోంది. బెంగళూరు, హైదరాబాద్​, పుణె, ముంబై వంటి సిటీలలో ఉద్యోగుల వల్లే అద్దె ఇండ్లకు గిరాకీ పెరుగుతోంది. బ్యాంకింగ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్, ఇన్సూరెన్స్​, సాఫ్ట్​వేర్​, ఫార్మాస్యూటికల్స్​ రంగాలలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏడాది కిందట కరోనా వైరస్​ భయం తగ్గుముఖం పట్టడంతోనే ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి కార్పొరేట్​ కంపెనీలు. కొవిడ్‌‌‌‌  వల్ల చాలా మంది ఉద్యోగులు అప్పట్లో  సొంత ఊర్లలోని ఇండ్లకు వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారిలో కొంత మంది అదే బాగుందని చెబుతుండగా, మరి కొంత మంది మాత్రం ఆఫీసులకు వెళ్లడమే మంచిదని పేర్కొంటున్నారు. ఇంకొంత మంది ఉద్యోగులు హైబ్రిడ్​ ఆప్షన్​ బెటరని అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు​ చాలా వరకు కొవిడ్​ ముందు లెవెల్​కు మారిపోయాయి. దీంతో రెసిడెన్షియల్​ హౌసింగ్​ మార్కెట్​ డిమాండ్​ ఎక్కువైంది. అద్దెకు దొరికే ఇండ్లు తగినంతగా లేకపోవడంతో ఉద్యోగుల కష్టాలు కూడా పెరిగాయి.

ఇండ్ల సప్లయ్​ కొరత....

కొవిడ్‌‌‌‌​–19 టైములో నిర్మాణ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఫలితంగా సప్లయ్ తగ్గిపోయింది. మరోవైపు నిర్మాణం పూర్తయిన ఇండ్ల కొనుగోలుకు కస్టమర్లు ముందుకు రాలేదు. ఎనరాక్​ డేటా ప్రకారం దేశంలో 2014 తర్వాత అమ్ముడవక మిగిలిపోయిన ఇండ్ల సంఖ్య 2023 లోనే  అతి తక్కువగా ఉంది. ఇండియా  సిలికాన్ ​వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రెసిడెన్షియల్​ రెంటల్స్ కొవిడ్‌‌‌‌ ​ముందు లెవెల్స్​తో పోలిస్తే ​ ఏకంగా 40 శాతం పెరిగాయి.

అద్దె ఇండ్లకు డిమాండ్​– అద్దెల పెరుగుదల విషయంలో దేశంలోని ఏడు సిటీలలో బెంగళూరు టాప్​ ప్లేస్​లో నిలుస్తున్నట్లు డేటా చెబుతోంది. కొవిడ్‌‌‌‌​ ముందు లెవెల్​ కంటే అద్దె ఇండ్ల డిమాండ్​ చాలా ఎక్కువగా పెరిగినట్లు ఎనరాక్​ రీసెర్చ్​ హెడ్​ ప్రశాంత్​ ఠాకూర్​ చెప్పారు. చాలా హౌసింగ్​ సొసైటీలలో ఖాళీ ఇండ్లే కనబడటం లేదని, కొవిడ్‌‌‌‌ ముందు లెవెల్​తో పోలిస్తే అద్దెలు 30 శాతం అధికమయ్యాయని కూడా ఆయన పేర్కొన్నారు. కొత్త అకడమిక్​ ఇయర్​ మొదలవడంతో అద్దె ఇండ్లకు డిమాండ్​ మరింత జోరయింది.

ఓనర్ల అత్యాశతో చుక్కలంటుతున్న అద్దెలు...

బెంగళూరులోని తానిసంద్ర మెయిన్​రోడ్​, మరాఠాహళ్లి ఓఆర్​ఆర్ ​ప్రాంతాలలో అద్దెలు ఏడాది కాలంలోనే ఏకంగా 24 శాతం పెరిగిపోయాయి. పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిపోయిందంటే ఇండ్ల ఓనర్లు అద్దెకు దిగే వారిని ఇంటర్వ్యూలు చేసేదాకా. గుగుల్ ​లాంటి కంపెనీల తరహాలో ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

మంచి లైఫ్​స్టైల్​ కోరుకోవడం వల్లే..

కొవిడ్‌‌‌‌–19 తర్వాత కుటుంబాల ఆలోచనా ధోరణి మారిందని, అందుకు తగినట్లుగా చాలినన్ని ఇండ్లు దొరకడం లేదని కొంత మంది రియల్టర్లు కంప్లెయింట్ చేస్తున్నారు. ఒకవైపు సప్లయ్​ చాలినంతగా లేకపోవడం...మరో వైపు కార్పొరేట్​ ఉద్యోగులు తిరిగి రావడంతో నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​(ఎన్​సీఆర్​)లో ఇండ్ల అద్దెలు  గత ఏడాది కాలంలో 25 నుంచి 40 శాతం దాకా ఎక్కువయ్యాయి.దేశంలో ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా ఈ సమస్యను మరికొంత జటిలం చేస్తున్నాయి. గతంలో ఇండ్లు కొందామనుకున్న వారు కూడా ఇప్పుడు ముందు అద్దెకు తీసుకుని, ఆ తర్వాత కొనుక్కుందామనుకుంటున్నారని ఎన్​సీఆర్​లోని ఒక రియల్టర్​ చెప్పారు. ప్రాపర్టీల రేట్లు, వడ్డీ రేట్లు రెండూ పెరగడంతో ఇండ్ల కొనుగోలు కొంత  కష్టమవుతోంది. ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని కార్పొరేట్​ కంపెనీలు కోరుకుంటుంటే.. బిల్డర్లు అధిక వడ్డీ రేట్ల సమస్యతో సతమతమవు తున్నారు. దీంతో ఇండ్ల అద్దెలు ఇప్పట్లో దిగి వచ్చే సూచనలేవీ కనబడటం లేదు.