హైదరాబాద్, వెలుగు: ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె గాంధీభవన్లో నిరుద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పారు.
మాటలకు జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్ అన్నీ సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఐటీ కింగ్ అని చెప్పుకునే కేటీఆర్.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులను ఆగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
టీఎస్పీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులు వారిని చావబాదారని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్తన పార్టీ పేరు మార్చి..జాతకం, గోత్రం మార్చుకున్నారని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు.