మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి భూ ఆక్రమణల చిట్టాను సీఎం సభ ముందుంచారు. ‘‘రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో జగదీశ్రెడ్డి, ఆయన భార్య సునీత, తండ్రి రామచంద్రారెడ్డి పేర్ల మీద దాదాపు 47 ఎకరాల భూమి ఉంటే.. అందులో ఏకంగా 11 ఎకరాల 15 గుంటల అసైన్మెంట్, మాఫీ ఇనాం భూములు కలిసిపోయి ఉన్నాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పక్కనే 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఫామ్హౌస్ నిర్మించారు. ఈ భూమి రికార్డుల్లోకి వస్తే అందులో 11.5 ఎకరాలు ఇనాం భూమిగా తేలింది.
ప్రభుత్వ ఇనాం భూములను ధరణి ద్వారా పట్టా భూములుగా మార్చుకొని సొంతం చేసుకోవడం పచ్చి దోపిడీ కాదా? దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మైక్ ఇస్తే ఇంకా పూర్తి జాతకం చెబుతారు. ఇక మొన్న డ్రగ్ పార్టీలో దొరికిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని సర్వే నంబర్ 177/3లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్హౌస్ నిర్మించారు. చట్టప్రకారం అసైన్డ్ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. పైగా అది 111 జీవో పరిధిలో నిషేధిత భూమి. వాటన్నింటినీ ఉల్లంఘించి రోహిత్రెడ్డి ఫామ్హౌస్ కట్టి దందాలు నడిపింది నిజం కాదా? ఆయన కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు కాదా?” అని ప్రశ్నించారు.
