సెక్యూరిటీ పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వండి
హైకోర్టులో ఎంపీ రేవంత్ రిట్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: తన ప్రాణాలకు ముప్పు ఉందని, 4 ప్లస్ 4 గన్మెన్లతో పాటు ఎస్కార్ట్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి శుక్రవారం హైకోర్టులో రిట్ వేశారు. తనకు సీఎం, మంత్రులు, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తనకు 3ప్లస్3 సెక్యూ రిటీ ఉండేదని, తర్వాత 2ప్లస్2కు తగ్గించారన్నారు. 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు 4ప్లస్4కు పెంచినా, మళ్లీ 2ప్లస్2కు తగ్గించేశారని చెప్పారు. దీంతో 2019 ఆగస్టులో కేంద్రానికి సెక్యూరిటీ పెంచాలని దరఖాస్తు చేసుకున్నానని, అది పరిశీలనలో ఉందని జవాబు వచ్చిందని, ఆ దరఖాస్తును ఆమోదించి భద్రత కల్పించేలా కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూములను జూపల్లి రామేశ్వరరావుకు కట్టబెట్టడంపై తాను పోరాటం చేశానని, ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిట్ పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను ప్రతివాదులుగా చేశారు.
For More News..