
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ తహసీల్దార్ లైవ్ లో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాలోని అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( జూన్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నెల్లిపాక రెవెన్యూ పరిధిలో మల్లెమడుగు గ్రామానికి చెందిన అరుణ 20 కుంటల భూమిని అదే గ్రామానికి చెందిన తూము శేఖర్, బద్ది సందీప్ అనే ఇద్దరికీ అమ్మింది. పట్టా 5తమ పేరు మీదకు మార్చుకోవడం కోసం తహసీల్దార్ రాజారావును సంప్రదించారు బాధితులు.
స్థానిక మీసేవలో స్లాట్ బుక్ చేసుకోని తహసీల్దార్ ను సంప్రదించగా.. రాజారావు రూ. 7 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాజారావుకు లంచం ఇస్తూ తెలివిగా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు బాధితుడు. ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాడు తహసీల్దార్. తానే డబ్బులు తీసుకుని లెక్క పెడుతూ మరీ రూ.ఏడు వేలే ఇస్తారా నాకు మరింత ఎక్కువ ఇవ్వండి అంటూ డిమాండ్ చేశాడు. ఈ మాటలు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి.
తహసిల్దార్ బహిరంగంగా లంచం తీసుకుంటున్న వీడియో బయటికి రావడంతో.. తహసిల్దార్ తో పాటుగా లంచం ఇచ్చిన వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తహసిల్దార్ చేసిన నిర్వకానికి జిల్లా ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు అధికారులు.