హైదరాబాద్: జూన్ 5 నుంచి తెలంగాణలో సవరించిన భూముల విలువలు అమల్లోకి రానున్నాయి. జూన్ 5 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరణ జరిగిందని, భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
క్షేత్ర స్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయం అమలు చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. భూములు ఉన్న ప్రదేశాన్ని బట్టి మార్కెట్ విలువలో మార్పులను సూచిస్తూ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు పంపించారు. జూన్ 5 నుంచి ఈ భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021, 2022లో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను సవరించింది. నాలుగేండ్లలో భూముల విలువ భారీ ఎత్తున పెరిగాయి. భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్, బహిరంగ మార్కెట్ విలువ మధ్య తేడా భారీస్థాయిలో ఉన్నా, ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయలేదు. 2024లో సవరించడానికి ప్రయత్నించింది.
భూములు విలువ వివరాలు మొత్తం పరిశీలించినా చివరకు పెంచకుండానే ఊరుకుంది. ఇటీవలే మళ్లీ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజులుగా తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు వివరాలను ప్రభుత్వానికి పంపించారు.
నేషనల్హైవే, స్టేట్ హైవే, జిల్లా హెడ్ క్వార్టర్స్ రోడ్ల పక్కనే ఉన్నవాటిని ప్రైమ్ ల్యాండ్స్గా గుర్తించారు. ప్రస్తుతం వీటికి ఉన్న విలువను కనీసం 50 శాతం పెంచే విధంగా ప్రతిపాదనలు చేశారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ విలువ బాగానే ఉన్నప్పటికీ వాణిజ్యపరమైన భూములకు ఎకరాకు కనీసం రూ.10 లక్షల విలువను పెంచుతూ సవరించాలని ప్రతిపాదనలు చేశారు.
ఇండ్ల స్థలాలు బిల్డింగ్స్, అపార్ట్మెంట్ల విలువ సవరణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువలను పోల్చి 25, 50, 100 శాతం పెంచే విధంగా ప్రతిపాదనలు చేశారు.
