ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో మంచు కొండలు భారీగా కరిగి ధౌలిగంగా నదికి వరద నీరు పోటెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయంతో రిషిగంగా పవర్ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అందులో పనిచేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను గుర్తించగా.. 16 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మిగిలిన అందరూ మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఘటనతో దయనీయ పరిస్థితిలో ఉన్న బాధితులను ఆదుకోవడానికి టీమిండియా క్రికెటర్, యువ ఆటగాడు రిషభ్ పంత్ ముందుకు వచ్చాడు. తనవంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు… బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ట్విటర్ వేదికగా అభిమానులకు పంత్ విజ్ఞప్తి చేశాడు.
పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్లోని రూర్కీ.

