దుబాయ్: ఐపీఎల్ హడావుడిని సరిగ్గా దసరా రోజునే కంప్లీట్ చేసుకున్న టీమిండియా క్రికెటర్లు అప్పుడే నేషనల్ డ్యూటీకి సిద్ధమయ్యారు. టీ20 వరల్డ్కప్ కోసం తమ అస్త్రశస్త్రాలను సరి చూసుకునే పనిలో పడ్డారు. మెగా టోర్నీకి సన్నాహకంగా సోమవారం జరిగే వామప్ మ్యాచ్లో బలమైన ఇంగ్లండ్తో తలపడనున్నారు. 24న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్తో వరల్డ్కప్ వేట షురూ చేయనున్న కోహ్లీ సేన.. ఆ లోపు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్ల ద్వారా జట్టులోని పలు సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరు? హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సంగతేంటి ? అతన్ని ఏ స్థానంలో ఆడించాలి ? అనే అంశాలతో పాటు సరైన బౌలింగ్ కాంబినేషన్ను ఎంచుకోవడం ప్రస్తుతం మేనేజ్మెంట్ ముందున్న సవాళ్లు.
ఇషాన్, రాహుల్లో ఎవరు?
రోహిత్ ఓపెనింగ్ పార్ట్నర్ రేసులో కెప్టెన్ కోహ్లీతోపాటు రాహుల్, ఇషాన్ కిషన్ ఉన్నారు. ఆర్సీబీకి విరాట్ మంచి ఆరంభాలు ఇవ్వడంతో ఇప్పుడు పోటీ బాగా పెరిగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, ఓపెనర్గా రాహుల్ సూపర్ పెర్ఫామెన్స్లు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఆడిన చివరి రెండు మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్ ఓపెనర్గా అదరగొట్టాడు. పైగా రోహిత్తో అతనికి మంచి సమన్వయం ఉండటం పెద్ద అడ్వాంటేజ్. విరాట్ ఓపెనర్గా వస్తే.. రాహుల్, కిషన్లో కనీసం ఒకరు మిడిలార్డర్లో ఆడతారు. కాబట్టి తుది జట్టులో ప్లేస్ నిలబెట్టుకోవాలంటే సూర్యకుమార్ కూడా పరుగులు చేసి తీరాల్సిందే.
హార్దిక్ ఓకేనా?
టీమ్ ముందున్న ప్రధాన సమస్యల్లో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కూడా ఒకటి. ఐపీఎల్లో బౌలింగ్కు దూరంగా ఉన్న అతను బ్యాటింగ్లోనూ ఫెయిలయ్యాడు. లైనప్లో చాలా కీలకమైన హార్దిక్ను పక్కన పెట్టాల్సి వస్తే మొత్తం కూర్పు దెబ్బతినే అవకాశముంది. అందుకే ఈ వామప్ మ్యాచ్ల్లోనే హార్దిక్ లేకుంటే ఎలా అనే ప్రశ్నకు బదులు వెతికి తీరాలి. హార్దిక్ను కాదనుకుంటే శార్దూల్ ఠాకూర్ కచ్చితంగా తుది జట్టులోకి వస్తాడు. పంత్ బ్యాటింగ్లో రాణించకపోతే కిషన్ నుంచి ముప్పు తప్పదు. జడేజా తుది జట్టులో ఉండటం ఖాయం. అతనికి తోడుగా అశ్విన్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి పోటీలో ఉన్నారు. పేస్ కోటాలో భువనేశ్వర్ ఫామ్లోకి రావడం అత్యవసరం. ఈ సమస్యలన్నింటికీ జట్టు మెంటార్ ధోనీ సరైన పరిష్కారం చూపిస్తాడని మేనేజ్మెంట్ నమ్ముతోంది.

