తెలంగాణ అమరుల కుటుంబాలకు త్వరలో రూ.25 వేల పింఛను

తెలంగాణ అమరుల కుటుంబాలకు త్వరలో రూ.25 వేల పింఛను
  • 250 గజాల ఇంటి స్థలం ఇస్తం: మంత్రి పొన్నం
  • బీసీ కార్పొరేషన్​లకు నిధులు మంజూరు చేశాం
  • త్వరలో జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్​కు ఏసీ బస్సులు
  • ఆర్టీసీ కార్మికుల డీఏ రూ.200 కోట్లు ఈ నెలాఖరులో ఇస్తమని వెల్లడి

నల్గొండ, వెలుగు:  తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు త్వరలో నెలకు రూ.25 వేల పింఛను, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. నల్గొండ రీజియన్ పరిధిలోని కొత్త బస్సులను ఇద్దరు మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని కేబినెట్​లో చర్చించి త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బీసీలకు పెద్దపీట వేస్తోందని, బీసీ కార్పొరేషన్​లకు నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో బలహీనవర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణనను చేపట్టేందుకు నిర్ణయించామని, దీనిలో భాగంగానే రూ.150 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహం, బీసీ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడంలో ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

దశల వారీగా ఫీజు రీయింబర్స్​మెంట్ 

బీసీ స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్​మెంట్, గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను దశల వారీగా తీరుస్తున్నామని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో బీసీల నుండి 4,500 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డీఏ ఇచ్చామని, 280 కోట్ల బకాయిలలో 80 కోట్లు ఇదివరకే చెల్లించామని.. మరో రూ.200 కోట్ల ఈ నెలాఖరుకు వారి ఖాతాలలో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులను నడుపుతామని, ముందుగా జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల జనాభా కలిగి అతి పెద్ద జిల్లాగా నల్గొండ ఉందని, అందువల్ల ఈ జిల్లాకు ప్రత్యేకంగా 25 బస్సుల తో పాటు, నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపోకి పూర్వవైభవం తీసుకరావాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లను నిర్మించనుందని తెలిపారు. ఏపీలో మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా అందరు పనిచేయాలని, చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.