
- నెలకు రూ.250 నుంచే సిప్!
- మ్యూచువల్ ఫండ్స్తో చర్చలు జరుపుతున్నామన్న సెబీ చైర్మన్ మాధవి
- చిన్న సైజ్ సిప్లతో మరింత మంది ఇన్వెస్ట్ చేస్తారని వెల్లడి
- మార్కెట్ బలపడే అవకాశం
న్యూఢిల్లీ : నెలకు రూ. 250 సిప్ చేసేందుకు వీలు కలిపించేలా మ్యూచువల్ ఫండ్స్తో చర్చలు జరుపుతున్నామని సెబీ చైర్మన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. చిన్న సైజ్ సిప్లను (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) తెస్తే మరింత మందికి ఫైనాన్షియల్ సర్వీస్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కనీస సిప్ సైజ్ రూ.500 నుంచి తగ్గించడానికి వీలవుతుందా? లేదా? అని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
సిప్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు మరింత స్ట్రాంగ్గా మారతాయని మాధవి పేర్కొన్నారు. సిప్లు చేసే ఇన్వెస్టర్లు ప్రతీ నెల కొద్ది మొత్తంలో తమకు నచ్చిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. క్వార్టర్కు ఒకసారి కూడా సిప్ చేసుకునే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. కిందటి నెల నాటికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మేనేజ్ చేస్తున్న ఫండ్స్ విలువ రూ.49 లక్షల కోట్లకు చేరుకుంది.
మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకుంటుండడంతో ఫండ్స్లోకి భారీగా సిప్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. కాగా, ఇప్పటికే కొన్ని ఫండ్స్ సిప్లను రూ.100 కే అనుమతిస్తున్నాయి. కానీ, ఈ లెవెల్ దగ్గర కంపెనీలకు లాభం ఉండడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. సిప్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే మన మార్కెట్లు స్ట్రాంగ్గా తయారవుతాయని మాధవి అన్నారు. ఇందుకో ఉదాహరణ కూడా చెప్పారు. ఇతర ఎమెర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే గత ఏడాది కాలంలో ఇండియన్ మార్కెట్లు మంచి పెర్ఫార్మెన్స్ చేశాయని, దీనికి కారణం ఎఫ్ఐఐలు వెళ్లిపోతున్నా రిటైల్ ఇన్వెస్టర్లు ఈ గ్యాప్ను భర్తీ చేయడమేనని తెలిపారు.
డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడం ద్వారా మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పార్టిసిపేట్ చేస్తున్నారని అన్నారు. ఇండియన్ మార్కెట్ల నుంచి వెళ్లిపోయిన వారు మళ్లీ తిరిగి వస్తారని, మన మార్కెట్ల ర్యాలీని మిస్ కాకూడదని చూస్తున్నారని అన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు సోషల్ మీడియా టిప్లు, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్ల నుంచి రికమండేషన్స్ తీసుకోవద్దని సెబీ పేర్కొంది.