కేసీఆర్​కు మద్యం టెండర్లపై ఉన్న సోయి..ఆసరా పెన్షన్లపై ఏది?

కేసీఆర్​కు మద్యం టెండర్లపై ఉన్న సోయి..ఆసరా పెన్షన్లపై ఏది?

సీఎం కేసీఆర్ కు మద్యం టెండర్లపై ఉన్న సోయి ఆసరా పెన్షన్ల ఇవ్వడంపై లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా అయిజ ఎంబీఆర్ ఫంక్షన్ హాల్​లో బీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల భరోసా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు పెన్షన్ల పెంపు వంటి హామీలు ఇచ్చి వారిని కేవలం ఓటర్లుగా మారుస్తున్నారన్నారు. 

రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే కేసీఆర్ లాగా బంగ్లాలో కూర్చోని తాగుతూ పాలన చేయబోమన్నారు. పూరి గుడిసెల్లో ఉన్న బహుజన వర్గాలను బంగ్లాలో కూర్చోబెట్టి పాలకులుగా మార్చడమే లక్ష్యమన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి,  వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో సదరం క్యాంపులు పూర్తయినా దివ్యాంగుల సర్టిఫికెట్ల జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బుద్వేల్ లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న 256 ఎకరాల దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుందని, కేసీఆర్ బినామీ కంపెనీలకు ఎకరానికి రూ.100 కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. 

ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుని సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. అంతకు ముందు కొత్తబస్టాండ్ సెంటర్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంబీఅర్ ఫంక్షన్ హాల్ వరకు దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సభ తర్వాత పలువురు పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు తిరుపాల్, ఇన్​చార్జి మధు గౌడ్, మండల అధ్యక్షుడు కుర్వ వీరన్న, మహిళా కో కన్వీనర్ శోభా గౌడ్, ప్రేమ్ కుమార్, ముప్పారపు ఎల్లయ్య పాల్గొన్నారు.