కీవ్: తూర్పు ఊక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు యుద్ధానికి దూరంగా ఉన్నా.. రష్యా ఆర్మీ మాత్రం మిసైల్స్తో విరుచుకుపడుతూనే ఉందని లుహాన్స్క్గవర్నర్ సెర్హి హైదై ఫేస్బుక్లో తెలిపారు. లైసిచాన్స్క్ నగరాన్ని దక్షిణం నుంచి దిగ్బంధించేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ఈ నగరం సీవీరోడోనెట్స్క్కు పక్కనే ఉంటుందని, కొన్ని వారాల నుంచి కనికరం లేకుండా దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ సైనికులు సీవీరోడోనెట్స్క్ నుంచి తిరుగుముఖం పట్టాయని, వీరిలో కొంత మంది లైసిచాన్స్క్కు వెళ్తున్నారని వివరించారు. ఒకప్పుడు సీవీరోడోనెట్స్క్ లో 10లక్షల మంది నివాసం ఉండేవారని, ఇప్పుడు 10వేలకు తగ్గారని చెప్పారు. కొందరు ఉక్రెయిన్ సైనికులు, 500 మంది పౌరులు సీవీరోడోనెట్స్క్ శివారులోని అజోట్ కెమికల్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నారన్నారు.
ఆ రెండు నగరాలే టార్గెట్
తూర్పు ఉక్రెయిన్ వైపు నుంచి లైసిచాన్స్క్, సీవీరోడోనెట్స్క్ నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు కదులుతున్నాయి. డాన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి లైసిచాన్స్క్, సీవీరోడోనెట్స్క్ నగరాలు సెంటర్ పాయింట్గా ఉన్నాయి. తూర్పు ఉక్రెయిన్లోని 95 శాతం ప్రాంతం రష్యా, వేర్పాటువాద శక్తుల నియంత్రణలో ఉంది. శనివారం లీవ్ రీజియన్లోని ఫ్యూయెల్స్టోరేజీలను రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. సెంట్రల్ ఉక్రెయిన్లోని జైటోమిర్ ప్రాంతంపై రష్యా రాకెట్లు దాడి చేయగా.. ఉక్రెయిన్ సైనికుడు చనిపోయినట్టు గవర్నర్ విటాలి బుచెంకో తెలిపారు.