న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్ యూరోల (దాదాపు రూ.58 వేల కోట్ల) కు చేరాయి. వాల్యూమ్ రెట్టింపు కావడం, ధరలు పెరగడం వల్ల ఇండియా ఇంపోర్ట్ బిల్ పెరిగిందని యూరోపియన్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) రిపోర్ట్ పేర్కొంది.
దీని ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.8 బిలియన్ యూరోలుగా ఉన్న ఫాసిల్ ఫ్యూయల్స్ (క్రూడ్ ఆయిల్, బొగ్గు వంటివి) దిగుమతులు, మార్చిలో 5.8 బిలియన్ యూరోలకు చేరాయి. ఇందులో 91శాతం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులే (5.3 బిలియన్ యూరోలు) ఉన్నాయి.
మిగతా భాగం బొగ్గు (337 మిలియన్ యూరోలు), ఆయిల్ ప్రొడక్ట్స్ (178.5 మిలియన్ యూరోలు) ఉన్నాయి. అమెరికా ఒక నెల పాటు రష్యా ఆయిల్పై ఆంక్షలు ఎత్తివేయడంతో, ప్రభుత్వ రిఫైనరీలు మళ్లీ రష్యా నుంచి కొనుగోలు ప్రారంభించాయి.

