
తెలంగాణలో రైతుల అకౌంట్లలో లక్ష రూపాయల రుణమాఫీ నిదులు జమ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. తొలి విడుతలో రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ఇవాళ 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి.. 7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది సర్కార్. మూడు విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 31 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
లక్షన్నరలోపు రుణాలు ఉన్నవాళ్లకు రెండో విడతలో భాగంగా జూలై ఆఖరి లోగా మాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ సర్కార్. ఇక 2 లక్షల వరకు అప్పు ఉన్నవాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం. దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని వెల్లడించారు. పంద్రాగస్టులోపు రైతులకు మూడు విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
రుణమాఫీ అయిన రైతులతో రైతు వేదికల్లో వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేసిన ఆనందాన్ని వారితో పంచుకున్నారు. అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడుతుండటంతో రైతులు, రైతు సంఘాల నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. పొలాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. గ్రామ కూడళ్లలో స్వీట్లు పంచుకుంటున్నారు.
ఇక రాష్ట్రంలో మూడు రోజుల పాటు రుణమాఫీ సంబురాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమన్నారు.