
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే.. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు అర్థమవుతోంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ట్రైలర్లోని ఇద్దరు కథానాయికల లుక్స్, పోరాట దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్, డ్రామా, హాస్యం మేళవింపుగా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ ఎంసీ క్లియరీ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.